జగన్ భారీ వ్యూహం- పీకేను వద్దనుకుని- 175 సీట్ల టార్గెట్ పెట్టి- అసలు ప్లాన్ ఇదే !
ఏపీలో వైసీపీని తొలిసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తిరిగి ఆ పార్టీ కోసం ఈ ఏడాది నుంచి సేవలు అందిస్తారని స్వయంగా కేబినెట్ భేటీలో మంత్రులకు చెప్పిన జగన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. పీకే సేవలు ఇక చాలనుకున్నారు. దాని స్ధానంలో 175 సీట్లపై టార్గెట్ పెట్టుకుని మంత్రులతో పాటు ఇన్ ఛార్జ్ లకూ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో జగన్ వ్యూహాలపై ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పీకేను వద్దనుకున్న జగన్
ఏపీలో వైసీపీని భారీ మెజారితో అధికారంలోకి తీసుకురావడం వెనక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత కీలకమో వైసీపీకీ, జగన్ కీ బాగా తెలుసు. వీరే కాదు సాధారణ జనానికీ, విపక్ష పార్టీలకు సైతం తెలుసు. మరి అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేయకుండా తన సంస్ధ ఐప్యాక్ సేవల్ని అందిస్తుందని చెప్పి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ తో తాను కోరుకుంటున్న సంబంధాలు, టీఆర్ఎస్ అందించే సేవలు వైసీపీపై పడే ప్రభావం నేపథ్యంలో ఈ బంధానికి బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా అంత సులువుగా జగన్ ప్రశాంత్ కిషోర్ ను వదులుకోలేని పరిస్ధితి. కానీ జగన్ సీరియస్ గానే ఈ నిర్ణయానికి వచ్చేశారు. దీంతో జగన్ నిర్ణయం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.

జగన్ 175 సీట్ల టార్గెట్
ప్రశాంత్ కిషోర్ లేకుండా అతని ఐప్యాక్ సాయంతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడమే ఓ రిస్క్ అయితే 175 సీట్ల టార్గెట్ పెట్టుకోవడం మరో రిస్క్. పార్టీ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించలేమా అని జగన్ వేసిన ప్రశ్నపై ఇప్పుడు సొంత పార్టీ వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలా నేరుగా ప్రశాంత్ కిషోర్ సేవల్ని దూరం చేసుకుని 175 సీట్లను టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్లాలన్న జగన్ నిర్ణయం వెనుక ఏముందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇందులో చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఐప్యాక్ ను నమ్ముకుని 175 సీట్ల టార్గెట్ సాధించడం సాధ్యమేనా అన్న చర్చ కూడా ఇందులో ముఖ్యమైనది.

జగన్ విశ్వాసమా ? అతి విశ్వాసమా
వైసీపీతో పాటు ఏపీ ప్రభుత్వంలోనూ ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ ను కాదనుకుని, ఆయన సంస్ధ ఐప్యాక్ సేవలు తీసుకుని 175 సీట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు భారీ రిస్క్ లా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తట్టుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుని ముందుకెళ్లాల్సిన పరిస్ధితుల్లో పీకే సేవలు దూరమైతే ఇప్పటికే వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులు, నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ఖాయంగా చెప్తున్నారు. అదే సమయంలో ఈ మూడేళ్లలో వైసీపీ సాధించిన విజయాలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు వ్యూహమిదే ?
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్ధితుల్ని గమనిస్తే వైసీపీని దాటుకుని టీడీపీ కానీ, ఇతర విపక్షాలు కానీ గట్టి పోటీ ఇవ్వడం కానీ, అధికారం దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి అంటే ఈ రెండేళ్ల కాలంలో పరిస్ధితులు అనూహ్యంగా మారిపోతే మినహా వైసీపీ జైత్రయాత్రకు వచ్చిన ఢోకా కూడా కనిపించడం లేదు. అదే సమయంలో పీకే నేరుగా పనిచేస్తే వందల కోట్ల భారం మినహా ఒరిగేదేమీ లేదు. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఉన్న తరుణంలో పీకేకు వందలకోట్లు వదిలించుకునే బదులు గతంలో ఆయన ఇచ్చిన వ్యూహాల్నే మరోసారి అమల్లోకి పెట్టడం ద్వారా మరో సక్సెస్ ను తమ ఖాతాల్లో వేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే డోర్ టూ డోర్ ప్రచారం వంటి బేసిక్స్ కే కట్టుబడాలని పార్టీ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అందులో సక్సెస్ కాగలిగితే కొత్తవ్యూహాలేవీ అవసరం లేదనే భావనలో జగన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications