వారు చెబితే ఎన్నికలకు సిద్దం: ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసేశారా : సీఎస్ కు ఎన్నికల కమిషనర్ ఘాటు లేఖ..!
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. తన పైన వేస్తున్న నిందలు..చేస్తున్న ఆరోపణల పైన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక, ఏపీ ప్రభుత్వం నుండి ప్రధాన కార్యదర్శి ఎన్నికల వాయిదా నిర్ణయం వెనక్కు తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సీఎస్ లేఖకు రమేష్ కుమార్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ రమేష్ కుమార్ ఏమని లేఖ రాశారు..?
సీఎస్ కు ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రం..
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఎన్నికలు నిర్వహణ పైన నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు సమాధానం ఇచ్చారు. అందులో తాను ఎన్నికల వాయిదా కు తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను మరోసారి వివరించారు. ఎన్నికల వాయిదా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్దిక సంఘం నిధులు నిలిచిపోతాయనే వాదనతో విభేదించారు. తాను గతంలో ఆర్దిక సంఘంలో..గవర్నర్ వద్ద సుదీర్ఘంగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం నుండి వచ్చిన హామీ మేరకే తాను ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేశామని..దీని పైన అనేక రకాలుగా విమర్శలు వచ్చాయని చెబుతూనే..వాటి లోతుల్లోకి వెళ్లటం లేదన్నారు. కరోనా వైరస్ ఊహించని విధంగా వ్యాప్తి చెందిందని..దీని పైన సీఎస్ తో సమావేశం సమయంలోనే సమాచారం కావాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ప్రపంచ ఆరోగ్య సంస్థ..జాతీయ స్థాయిలో కరోనా ప్రభావం ప్రజల పైన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను గమనిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చారు.తాను ఫోన్ ద్వారా ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడుతున్నానని..అయితే వారి నుండి అధికారికంగా సమాచారం కానీ..అధికారులు కానీ వచ్చి వివరాలు ఇవ్వలేకపోయారని..వారంతా కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రాల కంటే ముందు కారణమే..
కరోనా కారణంగా మహారాష్ట్ర, ఒడిశా, బెంగాల్ లోనూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని ఎన్నికల కమిషనర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇక, బీహార్ లో ఎన్నికల కమిషనర్ విచక్షణాధికారం మేరకే ఎన్నిలకను వాయిదా వేసిన విషయాన్ని వివరించారు.తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను...ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ ను పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో టచ్ లో ఉన్నారా లేదా అనేది తనకు తెలియదని..దేశంలో కరోనా స్టేజ్ 2 లో ఉందని నిపుణులు చెబుతున్నారని వివరించారు. ఓటు వేసేందుకు వచ్చే వారు లైన్లలో ఉంటారని..అదే విధంగా పేపర్ బ్యాలెట్ వినియోగం కారణంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని మరో సారి విశ్లేషించారు. మిగిలిన రాష్ట్రాల్లో తాను నిర్ణయం తీసుకున్న తరువాతి రోజు తీసుకున్నారని..తాను సైతం వారితో కలిసి నిర్ణయం తీసుకొని ఉంటే ఈ రకమైన నిందలకు అవకాశం ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించారు. గతంలో ఇటువంటి సందర్భాల్లో ఎన్నికలు నిలిపివేసినా నిధులు కేంద్ర విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
వారు చెబితే నిర్వహిస్తాం..నిందలు సరికాదు..
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తి కరంగా ఉండటం,జాతీయ కరోనా నిరోధక టాస్క్ఫోర్స్ నివేదికలు..వ్యాధి తీవ్రత వలన ఎన్నికలకు ఇబ్బంది లేదని నివేదిక వస్తే.....తాము ఎన్నికల వాయిదా నిర్ణయం పైన సమీక్షించటానికి.. నిర్ణయం పరిశీలించటానికి ఎటువంటి ఇబ్బంది లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అదే సమయంలో కమిషన్ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. తన పైన వేస్తున్న నిందలు.. చేస్తున్న వ్యాఖ్యలు తనకు మనస్థాపం కలిగించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించటమే తమ విధి అని స్పష్టం చేశారు. ఎటువంటి దురుద్దేశంతోనో..అవగాహన లేకండా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ సమాచారమే కాదని..అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సమాచారం సేకరించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ లేఖ పైన ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.