వివేకా కేసులో సీబీఐ మీనమేషాలు-దస్తగిరికి ప్రాణహాని ముప్పు-కాపాడాలని కడప ఎస్పీకి విన్నపాలు
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సుదీర్ఘంగా సాగుతోంది. సంక్లిష్టమైన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, నిందితులెవరో కూడా దాదాపుగా తేలిపోయినా కేసులో తుది అభియోగ పత్రం మాత్రం ఇంకా దాఖలు కావడం లేదు. దీంతో ఈ నిందితుల పేర్లు చెప్పిన మరో నిందితుడు, అప్రూవర్ గా మారిన వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరికి ప్రాణహాని పెరుగుతోంది.
వివేకా కేసులో ట్విస్టులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తు పలు సంచలనాలకు కారణమవుతోంది. ఈ హత్య కేసులో పలువురు వీఐపీలు, ప్రజాప్రతినిధుల పేర్లతో పాటు అసలు హంతకుల పేర్లు కూడా దాదాపుగా బయటికి వచ్చేశాయి. ఇక కేసు ముగించడమే తదుపరి అనుకున్న ప్రతిసారీ సీబీఐ సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది.
తెరవెనుక ఉన్న ఒత్తిళ్ల కారణంగానో, మరే ఇతర కారణాలతోనో సీబీఐ కీలక దశలో సైలెంట్ అయిపోవడంతో ఈ కేసులో అప్పటివరకూ సీబీఐకి సహకరించిన వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతోంది. వారికి కల్పిస్తున్న పోలీసు భద్రత సరిపోతుందా, అందులో ఏమాత్రం తేడా వచ్చినా వారి పరిస్దితి, ఈ కేసు పరిస్ధితి ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అప్రూవర్ దస్తగిరికి ప్రాణహాని
ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్రూవర్ భయంతో అప్రూవర్ గా మారతానని సీబీఐకి చెప్పడంతో కోర్టు అనుమతితో అందుకు అనుమతించారు.ఆ తర్వాత ఆయన సీబీఐకి ఇచ్చిన రెండు వాంగ్మూలాలు బయటికి వచ్చాయి. ఇందులో పలువురు కీలక నిందితుల పేర్లు వెలుగుచూశాయి.
ఫైనల్ గా ఈ కేసులో ఇన్ని వివరాలు బయటికి రావడానికి దస్తగిరే కారణం. అలాంటి అప్రూవర్ కు ఎలాంటి భద్రత కల్పించాలన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వన్ ప్లస్ త్రీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నా ఆచరణలో మాత్రం అది వాస్తవమా కాదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి దస్తగిరి తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణం.
పొంతన లేని వ్యాఖ్యలు
ఈ కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని, సెక్యూరిటీని కూడా అడుక్కోవాల్సి వస్తోందని, సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు ప్రతిసారి ఫోన్ చేసి సెక్యూరిటీ తీసుకోవడం ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. అయితే కడప ఎస్పీ మాత్రం ఆయనకు వ్యక్తిగత పనుల కోసం కూడా సెక్యూరిటీని ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎవరి మాట నిజమో తెలియడం లేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన దస్తగిరికి ప్రాణహాని ఉన్నమాట నిజమే.ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అయితే ఆయనకు కల్పిస్తున్న భద్రతపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తకుండా చూసుకోవడం పోలీసుల బాధ్యత కూడా. అందులో వారు ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తారనే దానిపై ఈ కేసు భవిష్యత్తు ఆధారపడనుంది.
ఏమాత్రం తేడా వచ్చినా ...
దస్తగిరిపై ఇప్పుడు ఈకేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ కన్నుంది. వీరితో పాటు ఆయన వాంగ్మూలంలో ప్రస్తావించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కన్నూ ఉండే అవకాశముంది. అలాంటి సమయంలో దస్తగిరి బతికుంటే తాము జైలుకెళ్లడం ఖాయమని వీరిలో ఎవరో ఒకరు భావించినా అది ఈ కేసు పురోగతిపైనా, తుది తీర్పుపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
దీంతో దస్తగిరిని కాపాడాల్సిన బాధ్యత కూడా సీబీఐపైనే ఉంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా పూర్తిచేయడంతో పాటు అప్రూవర్ ను కాపాడుకోగలిగితేనే అసలు నిందితుల్ని చట్టం ముందు దోషులుగా నిరూపించే అవకాశం ఉంటుంది. లేకపోతే పరిటాల రవి హత్య కేసు తరహాలోనే నీరు గారడం ఖాయంగా తెలుస్తోంది.