జగన్కు కెవిపి కోవర్టు, చెన్నైతో అమరావతికి లింక్ పెడ్తారా: లింగారెడ్డి
హైదరాబాద్: ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న తమిళనాడు రాజధాని చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న సమయంలో చెన్నైకీ అమరావతికీ ముడిపెడుతూ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రాంచందర్రావు అవకాశవాద రాజకీయాలకు తెరలేపారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.
ప్రకృతి విపత్తుల్లో కూడా రాజకీయాలు వెతకడం వైఎస్ ఆత్మకు తెలిసినంత ఎవరికీ తెలియదని ఆయన విమర్శించారు. చెన్నై వరద బీభత్సం నేపథ్యంలో ఏపి ప్రజలు రాజధాని విషయంలో ఆందోళన చెందుతున్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్కు కెవిపి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాజధాని అమరావతి కోసం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలు స్థలం ఇచ్చారన్న సంగతి కెవిపికి మరచిపోయినట్టుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైనా, కెవిపి మాత్రం జగన్కు కోవర్టుగానే పనిచేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటిదాకా జగన్కు పరోక్షంగా సాగిన కెవిపి రహస్య అనుబంధం కేంద్రమంత్రికి రాసిన లేఖతో బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. రాజధానికి అన్ని పర్యావరణ అనుమతులున్నాయని, ఎవరి ప్రోద్భలంతో, ఎవరి రాజకీయ అజెండాకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారో ప్రజలందరికీ తెలుసనిని అన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నించిన జగన్కు ఏ గతి పట్టిందో కెవిపికి కూడా అదే గతి పడుతుందని లింగారెడ్డి అన్నారు.