రాక్షస శిక్ష: పెనంలా కాలుతున్న రేకుపై బాలికను కూర్చోబెట్టిన టీచర్
ఏలూరు: తరచూ మూత్ర విసర్జన చేసుకుంటోందనే కోపంతో మూడేళ్ల బాలికను మండే ఎండలో పెనంలా కాలుతున్న రేకు జారుడు బల్లపై కూర్చోబెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూలులో మంగళవారం ఈ దారుణం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వినాయకనగర్కు చెందిన సపటి మల్లికార్జునరావు, త్రివేణి దంపతుల పెద్ద కుమార్తె జ్వాలాశ్రీ(3) హోప్ స్కూలులో ఎల్కేజీ చదువుతోంది. ఆ బాలికకు తరచూ మూత్రవిసర్జన చేసుకునే బలహీనత ఉంది.

బాలికపై స్కూలు టీచరు, ఆయాలు తరచూ చిరాకు పడుతుండేవారు. మంగళవారం కూడా జ్వాలాశ్రీ మరోసారి మూత్రవిసర్జన చేయడంతో టీచరు అంజనాదేవి కోపంతో ఊగిపోయింది. ఒంటిపై బట్టలన్నీ తీసివేసి ఎండలో కాలుతున్న రేకు జారుడుబల్లపై కూర్చోబెట్టాలని ఆయా పద్మకుమారిని ఆదేశించడంతో జ్వాలాశ్రీని ఆయా తీసుకెళ్లి కూర్చోబెట్టింది.
దీంతో బాలిక వెనుకభాగం కాలిపోయి చర్మం ఊడిపోయింది. విషయం తెలిసి కోపోద్రిక్తులైన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తనంతట తానే రేకు జారుడు బండపైకి వెళ్లిందని పాఠశాల అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications