జగన్.. తానుకొటి తలిస్తే కరోనా వేరొకటి తలచింది: వైరస్ మిగిల్చిన నష్టం రూ. 5000 కోట్లు..!
అమరావతి: మొత్తం భూగోళాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ జగన్ సర్కార్పై పెను ప్రభావాన్నే చూపింది. అల్లాటప్పా ఎఫెక్టేమీ కాదు. దాని విలువ 5000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. కరోనా వైరస్ ప్రభావం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా పడింది. ఫలితంగా- సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది జగన్ సర్కార్. దీనివల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5000 కోట్ల రూపాయలు స్తంభించిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం వల్ల..
నిజానికి- ఈ నెల 31వ తేదీలోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన జగన్ సర్కార్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నిర్దేశిత గడువు కంటే ముందే స్థానిక సంస్థలను ముగించేయడం, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందుతాయనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఆ నిధుల విలువ కాస్త అటు, ఇటుగా 5000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని రాబట్టుకోవాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో పరిపాలనను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దెబ్బకొట్టిన కరోనా వైరస్..
తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్టు కనిపిస్తోంది ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నిర్దేశిత గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, కేంద్రం నుంచి 5000 కోట్ల రూపాయల నిధులను రాబట్టుకోవాలని, గ్రామాలను పటిష్ఠ పర్చాలని ఆయన భావించినప్పటికీ.. కరోనా వైరస్ దాన్ని తలకిందులు చేసి పారేసిందంతే. స్థానిక సంస్థల ఎన్నికల ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా పడటం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 5000 కోట్ల రూపాయలకు గ్యారంటీ లేకుండా పోయిందనే అభిప్రాయాలు ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది.

రెండేళ్ల కిందటే పూర్తి చేయాల్సి ఉన్నా..
నిజానికి- 2018 లోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎన్నికల్లో తలపడటానికి నాటి ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలై పడుతుందనే ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించలేదనే విమర్శలు చాలా సందర్భాల్లో ఇప్పటికే వినిపించాయి. 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి.

న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడినా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరి నాటికి ఎన్నికలను ముగించేయడానికి జగన్ సర్కార్ సన్నద్ధమైనప్పటికీ..న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉన్నాయంటూ టీడీపీ నేతలు కోర్టుని ఆశ్రయించడంతో జాప్యం చోటు చేసుకుంది. చివరికి రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండేలా ఏర్పాట్లు చేసింది. రీ నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించడంతో దానికి అనుగుణంగా మార్చిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ రూపంలో దురదృష్టం వెంటాడిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications