రాజధానికి వ్యతిరేకంగా రాస్తే చంపేస్తాం: జర్నోపై దాడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో జర్నలిస్టు పైన దాడి జరిగింది. తమకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నారంటూ కొందరు జర్నలిస్టుల మీద దాడికి పాల్పడ్డారు. దీని పైన స్థానిక జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. దీంతో వారి పైన మరోసారి దాడికి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది. జర్నలిస్టులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
రాజధాని కోసం అఫిడవిట్ వద్దు
బహుళ పంటలు పండే భూములను రైతులు రాజధాని కోసం అఫిడవిట్లు ఇవ్వవద్దని జన చైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి సూచించారు. రైతులు ఆహారభద్రతను కాపాడాలని ఆయన బుధవారం అన్నారు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణ చేసి రైతు ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు.
రాష్ట్ర రాజధాని భూసమీకరణ పైన అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేథావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల పంటలు, ఆస్తుల ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి బెదిరింపులకు రైతులు లొంగరన్నారు.
రాజధాని పరిసర గ్రామాల్లో పంటలు తగులబడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లక్ష్మణ్ రెడ్డి సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ప్రక్రియ బుధవారం మొదలైంది. గుంటూరు జిల్లాలోని నేలపాడు నుంచి భూసమీకరణకు శ్రీకారం చుట్టారు. రైతుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణకు 27 బృందాలను ఏర్పాటు చేశారు.