పోరస్ ఫ్యాక్టరీ తరలించాల్సిందే- అక్కిరెడ్డిగూడెంలో స్ధానికుల ఆందోళనలు-సర్కార్ మౌనం
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో గత వారం బాయిలర్ పేలుడులో ఆరుగురు చనిపోయారు. పది మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటికప్పుడు మృతులకు పరిహారాలు ప్రకటించి, క్షతగాత్రుల్ని ఆస్పత్రుల్లో చేర్పించిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిపై మౌనం వహిస్తోంది. దీనిపై స్ధానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇవాళ అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో ఇప్పటికీ పనులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఉత్పత్తిని ఆపాలంటూ ఆందోళన చేపట్టారు.ఫ్యాక్టరీ గేటు తోసుకొని లోపలకు ప్రవేశించిన గ్రామస్తులు అక్కడే నిరసనకు దిగారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నూజివీడు డిఎస్పి బి శ్రీనివాసులు సిబ్బందితో ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు.
అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదం తర్వాత స్ధానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోసారి బాయిలర్ పేలుడు పంటి ఘటనలు జరిగితే తమ ప్రాణాలకు దిక్కెవరంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కానీ, అధికారుల వద్ద కానీ సమాధానం లేదు.
దీంతో స్ధానికులకు అధికారులు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్దున్నారు. ఈ మాటల్ని వినేందుకు స్ధానికులు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని తరలించాల్సిందేనంటూ స్ధానికులు నిరసనలకు దిగుతున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.