జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..
నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూడు గంటల పాటు విరామం ఇవ్వడంతో ఒకేసారి వస్తువుల కోసం జనం భారీగా ఎగబడుతున్నారు. అయితే ఈ రద్దీ తగ్గించేందుకు ఆన్ లైన్ పోర్టళ్లు ఆర్డర్లు అనుమతిస్తున్నా వాటి డెలివరీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, డెలివరీ బాయ్స్ పై దాడులు చేస్తుండటంతో
పలుచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చివరికి ఆయా పోర్టళ్లు ఆర్డర్లు రద్దు చేస్తుండటంతో జనం తిరిగి రోడ్లపైకి రాక తప్పని పరిస్ధితులు తలెత్తుతున్నాయి.

లాక్ డౌన్ తో నిత్యావసరాలకు కటకట..
కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చేనెల 15 వరకూ లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిన్న ప్రకటన చేశారు. అయితే ఆదివారం నుంచే జనతా కర్ఫ్యూ ప్రకటనతోనే జన జీవనం స్తంభించడం ప్రారంభమైంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదన్న భయాలతో జనం నాలుగు రోజులుగా నిత్యావసరాల కోసం రోడ్లపైకి వస్తున్నారు. అయితే లాక్ డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని కేంద్రం.. రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల తమ లాఠీలకు పని చెబుతున్నారు. దీంతో జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.

ఆన్ లైన్ ఆర్డర్లు ఇద్దామంటే..
లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చే పరిస్ధితులు దాదాపు లేకుండా పోయాయి. నిత్యావసరాల కొనుగోలు కోసం ఉదయం 3 గంటలు మాత్రమే సమయం ఇవ్వడంతో జనం రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో పాటే కరోనా భయాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో జనం ఆన్ లైన్ లో కూరగాయలు, మందులు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారు. తొలుత ఆన్ లైన్ ఆర్డర్లను అనుమతించిన పోర్టళ్లు రెండు రోజులుగా వాటిని కూడా నిలిపేశాయి. లాక్ డౌన్ నేపథ్యంలో తమ డెలివరీ బాయ్స్ పై పోలీసులు ప్రతాపం చూపిస్తుండటమే దీనికి కారణం. పోలీసుల దాడులతో బెంబేలెత్తుతున్న డెలివరీ బాయ్స్ విధుల్లోకి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో చేసేది లేక ఆన్ లైన్ పోర్టళ్లు ఆర్డర్లు తీసుకోవడం నిలిపేశాయి.

ఆన్ లైన్ ఆర్డర్లు నిలిచిపోవడంతో..
పోలీసుల దాడులతో ఆన్ లైన్ పోర్టల్స్ కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం మానేయడంతో ఇప్పుడు జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం ఆన్ లైన్ ఆర్డర్లకు అలవాటుపడిన జనం ఇంటి వద్దే ఉండి ఆర్డర్లు ఇవ్వలేక, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వెళ్లలేక నలిగిపోతున్నారు. అలాగని ఉదయం అధికారులు అనుమతిస్తున్న మూడు గంటల్లో రైతుబజార్లకు, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు వెళదామన్నా రద్దీ చూసి భయపడిపోయే పరిస్ధితి. ఒకేసారి వందల సంఖ్యలో జనం క కొనుగోళ్లకు తరలి వస్తుండటంతో ఉదయం షాపింగ్ కిటకిటలాడుతోంది. దీంతో కరోనా వ్యాప్తి భయాలు మరింత పెరుగుతున్నాయి.

ఆన్ లైన్ కొనుగోళ్లతో రద్దీ తగ్గే అవకాశం..
అదే నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పప్పు దినుసులు, కిరాణా సామాగ్రి, మందులు ఆన్ లైన్ పోర్టళ్లలో ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండి ఉంటే ఉదయం షాపింగ్ కోసం జనం భారీగా తరలివచ్చే పరిస్ధితి ఉండేది కాదు. కానీ డెలివరీ బాయ్స్ ను అనుమతివ్వకపోవడంతో ఇప్పుడు జనమే నేరుగా రోడ్లపైకి వస్తున్నారు. అదీ నిత్యావసర వస్తువులు దొరుకుతాయో లేదో అన్న భయంతో వందల సంఖ్యలో ఒకేసారి తరలి వస్తుండటంతో కరోనా భయాలు మరింత పెరుగుతున్నాయి. వీరిలో ఒకరిద్దరికి కరోనా సోకి ఉన్నా అది మిగతా వారికి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టళ్ల ద్వారా కొనుగోళ్లకు సహకరించాలని కస్టమర్లు కోరుతున్నారు. కానీ పోలీసులకు కూడా ప్రభుత్వం నుంచి స్ఫష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వారు కూడా అనుమతించలేమని తేల్చి చెబుతున్నారు.
Recommended Video












Click it and Unblock the Notifications