సారా మరణాలన్నీ వైఎస్ జగన్ హత్యలే.. వైసీపీ నాటుసారా మాఫియా: లోకేష్ ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస మరణాలపై ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు దద్ధరిల్లింది. కల్తీ నాటు సారా తాగడం వల్లే జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు సంభవించాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తే, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని వైసీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. సభలో జంగారెడ్డి గూడెం మరణాలపై కొనసాగిన రచ్చ నేపధ్యంలో ఐదుగురు టీడీపీ సీనియర్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ నాయకుల సస్పెన్షన్ తర్వాత కూడా ఏపీ అసెంబ్లీ వద్ద రగడ కొనసాగింది.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీ ముందు టీడీపీ ఆందోళన
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అనంతరం వారికి మద్దతుగా సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆధ్వర్యంలోటీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న మరణాలు కల్తీసారా వల్లే సంభవించినా ప్రభుత్వం అవేవీ కాదని ఈ వ్యవహారాన్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడ్డారు.
సారా మరణాలు అన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్యలే
జగన్ నిర్లక్ష్యం, ధన దాహం వల్లే ఇలా మరణాలు సంభవించాయని, సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని మండిపడ్డారు. ఇక ఇదే విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు అన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్యలేనంటూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి అసెంబ్లీ బయట నిరసన తెలిపామని ట్విట్టర్లో పేర్కొన్నారు. మధ్యనిషేదం అన్న జగన్ మాట తప్పి సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి అని లోకేష్ ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ నాటుసారా మాఫియా, జగన్ మోసం ఖరీదు ఈ 25 ప్రాణాలు
వైయస్సార్సీపి నాటు సారా మాఫియా అంటూ మండిపడ్డారు. జగన్ మోసం ఖరీదు ఈ 25 ప్రాణాలు అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలియజేశామని లోకేష్ పేర్కొన్నారు. సారా మరణాలపై న్యాయ విచారణ జరగాలని, ఒక్కో మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క ఊరు పేరు లేని పిచ్చి మందు మద్యం దుకాణాలలో అమ్ముతుంటే, మరో పక్క నాటుసారా ఏరులై పారుతుంది అంటూ ధ్వజ మెత్తారు. అక్కాచెల్లెళ్ళ కాపురాలలో జగనన్న కుంపటి పెడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Recommended Video
తండ్రి శవం దొరక్క ముందే సీఎం సీటు కోసం సంతకాల సేకరణ చేసిన వ్యక్తి జగన్
శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తండ్రి శవం దొరక్క ముందే సీఎం సీటు కోసం సంతకాల సేకరణ చేపట్టిన వ్యక్తి సీఎం జగన్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మనకు తెలిసి చనిపోయింది 25 మందే, తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. మరణాల పై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెం లో చోటుచేసుకున్న మరణాలపై పోస్టుమార్టం రిపోర్టు రాకముందే మంత్రులే సహజ మరణాలని తేల్చటం దారుణం అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం లో చోటుచేసుకున్న మరణాలపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు.