మానవత్వం లేని ముఖ్యమంత్రీ .. అభినవ నీరో చక్రవర్తి , జగన్ వల్లే అన్యాయపు చావులు : లోకేష్ ధ్వజం
శ్రీకాకుళం జిల్లాలో కన్న కూతురు ముందే తండ్రి కరోనా మహమ్మారికి బలైపోయిన ఘటనపై, హిందూపురంలో కరోనా బాధితుల మరణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కన్నతండ్రి కళ్లముందే విలవిలలాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సమయంలో నాన్న.. లే నాన్నా అంటూ ఆ చిన్నారి చేసిన ఆక్రందన సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినిపించలేదా అంటూ ప్రశ్నించారు.
Recommended Video

అభినవ నీరో చక్రవర్తి వైయస్ జగన్ , గురుమూర్తికి శాలువాలు కప్పుతున్నారు
కరోనా పంజా కు ఆంధ్ర ప్రదేశ్ శవాలగట్టగా మారుతుంటే అభినవ నీరో చక్రవర్తి వైయస్ జగన్ తాడేపల్లి ఇంట్లో తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి శాలువాలు కప్పుతున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు. విజయవాడలో ఊరేగించి విజయసాయి రెడ్డి అల్లుడికి కట్నంగా చదివించిన 104,108 అంబులెన్స్ లేవీ ? అని ప్రశ్నించారు నారా లోకేష్. నీ బంధువులకు కట్టబెట్టిన కాల్ సెంటర్ ఏమైంది ? అంటూ నారా లోకేష్ నిలదీశారు.

మూడు గంటల లోపు ఆస్పత్రిలో బెడ్ కాదు కదా,స్మశానంలో పాడె కూడా దొరకడంలేదు
మూడు గంటల లోపు ఆస్పత్రిలో బెడ్ కాదు కదా,స్మశానంలో పాడె కూడా దొరకడం లేదని మండిపడ్డారు. విజయవాడలో కరోనా సోకిన వలసకూలీ అసిరి నాయుడు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోలేని ఆరోగ్యశాఖ కి ఏం అనారోగ్యం వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసొచ్చిన నగరం పొమ్మంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సొంతూరు జి.సిగడాం మండలం అయ్యానపేట పల్లెకి పోతే స్థానికులు ఊర్లోకి రానివ్వకపోతే కనీసం పట్టించుకోని నీ వాలంటీర్లు ఎక్కడికి పోయారు ? అంటూ నిలదీశారు నారా లోకేష్.

మానవత్వం లేని ముఖ్యమంత్రీ .. నీ చేతగాని పాలన వల్లే అన్యాయపు చావులు
భార్య ,పిల్లల ముందే అసిరి నాయుడు అనాధలా కన్నుమూశాడని పేర్కొన్నారు. మానవత్వం లేని ముఖ్యమంత్రీ .. నీ చేతగాని పాలన వల్లే ఈ అన్యాయమైన అకాలపు చావులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. అంతకు ముందు హిందూపూర్ ఆస్పతిలో మరణాలపై నారా లోకేష్ విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆస్పత్రిలో 8 మంది చనిపోయేవారు కాదు. ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వాడితే బాగుండేదని అన్నారు.

రాష్ట్రంలో కర్నూలు , అనంతపురం ఆస్పత్రుల్లో మరణాలపై లోకేష్ ప్రశ్నల వర్షం
కర్నూలు ఆస్పత్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదు. అధికారులు, పోలీసులు, వాలంటీర్లను వాడుకుని తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రాణవాయువు అందించే దానిపై పెట్టి వుంటే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 10 మంది చనిపోయేవారు కాదు అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఏదో ఒక అక్రమకేసు పెట్టి అరెస్ట్ చేయించాలని చేస్తున్న ప్రయత్నాలు, ఉత్తరాంధ్రలోని ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాల కల్పనపై పెట్టి వుంటే విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్లు చనిపోయి వుండేవారు కాదన్నారు.

హిందూపూర్ ఘటనపై లోకేష్ ఫైర్ , ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డిదే బాధ్యత
ప్రజలకి రక్షగా ఉంటావని ఎన్నుకుంటే, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నావు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు జగన్ అంటూ ధ్వజమెత్తారు లోకేష్ . హిందూపూర్ ఘటన పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలని లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని గత కొంత కాలంగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు . ఆస్పత్రులలో బెడ్ల కొరత,
మందుల కొరత ,ఆక్సిజన్ కొరత ఉందని , ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications