టిడిపి సెంట్రల్ కమిటీ జిఎస్గా నారా లోకేష్: రేవంత్ రెడ్డికి టిటీడీపి పగ్గాలు?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన దృష్టి సారించారు. పార్టీ సెంట్రల్ కమిటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చంద్రబాబు కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేశారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సంస్ధాగత ఎన్నికల కమిటీ కన్వీనర్ కళా వెంకటరావు, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరి, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్తో సమావేశమయ్యారు. కేంద్ర కమిటీలో ఏయే పదవులు ఉండాలనే విషయంపై కొంత చర్చించారు. ముగ్గురు జనరల్ సెక్రటరీలను, ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకోవాలని నిర్ణయించారు.
ముగ్గురు ప్రధాన కార్యదర్శుల్లో తెలంగాణ, ఏపీల నుంచి ఒక్కొక్కరు, వారి మధ్య సమన్వయం కోసం మరొకరిని ఎన్నుకుంటారు. అలాగే సెంట్రల్ కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయకులు ఇద్దరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. పొలిట్ బ్యూరోలో 12 నుంచి 15 మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా సంస్థాగత ఎన్నికల కమిటీ గురించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపాల్సి ఉండడంతో ఈ అంశంపై కూడా కసరత్తు చేశారు.
అయితే ఈ సమావేశంలో కమిటీల ఎంపిక పూర్తి కాకపోవడంతో శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అంతకు ముందు చంద్రబాబు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కమిటీ కన్వీనర్ నారా లోకేష్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలిశారు.
పార్టీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో కూడా కళా వెంకటరావు ఇదే సూచనను చేయగా, చంద్రబాబు నవ్వి ఊరుకున్నారు.
కాగా, ఇటీవలి రేవంత్రెడ్డి వ్యవహారంతో తెలంగాణ పార్టీ కమిటీలోనూ కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డికి కోర్టు ఆంక్షలు తొలగిపోవడంతో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ టిడిపి బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.