రఘురామ అరెస్టుపై లోక్సభ స్పీకర్ చర్యలు- ప్రివిలేజ్ కమిటీ, హోంశాఖకు రిఫర్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం ఇప్పుడు లోక్సభ స్పీకర్ కోర్టుకు చేరింది. ఓ ఎంపీగా ఉన్న రఘురామరాజును లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ అరెస్టు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన చర్యలు ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ సీఐడీ ఎంపీ రఘురామరాజుకు హైదరాబాద్ నివాసంలో నోటీసులు ఇచ్చి అరెస్టు చేసింది. అయితే అంతకుముందే ఈ అరెస్టుపై లోక్సభ స్పీకర్కు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అలా జరగలేదని, సీఐడీ కస్టడీలో ఆయన్ను చిత్ర హింసలు పెట్టారని కుటుంబ సభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా నివేదిక తెప్పించుకుంటానని నిన్న వారికి హామీ ఇచ్చారు.
ఇవాళ లోక్సభ స్పీకర్ కార్యాలయం ఎంపీ రఘురామరాజు అరెస్టు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని సభా హక్కుల కమిటీతో పాటు హోంశాఖకూ రిఫర్ చేసింది. వీటిపై దర్యాప్తు చేసి స్పీకర్కు నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో ఇప్పుడు సీఐడీ తీసుకున్న నిర్ణయంపై లోక్సభ హక్కుల కమిటీతో పాటు హోంశాఖ నివేదిక కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం రఘురామ చర్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో లోక్సభ స్పీకర్కు ఇచ్చే నివేదికలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.