అవిభక్త కవలలు వీణావాణీలను వేరు చేస్తాం: లండన్ వైద్యులు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అవిభక్త కవలలను వేరుచేయగలిగిన లండన్ వైద్యులు నగరానికి చేరుకున్నారు. లండన్లోని గ్రేట్ ఆర్మండ్ స్ర్టీట్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీలు నీలోఫర్ ఆస్పత్రికి తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు వీణా-వాణీలకు వైద్య పరీక్షలు చేశారు. శస్త్ర చికిత్స చేసి వీణావాణీలను వేరు చేస్తామని లండన్ వైద్యులు చెప్పారు. ఇంతకు ముందు రెండు అటవంటి శస్త్ర చికిత్సలు చేశామని వారన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో వారిద్దరిని పరీక్షించిన తర్వాత వారు ఆ నిర్ధారణకు వచ్చారు.
వీణావాణీలకు శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీణావాణీలకు శస్త్రచికిత్స చేయవచ్చుననే నిర్ధారణకు వచ్చినట్లు లండన్ వైద్యులు చెప్పారు. లండన్లోనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వారన్నారు. వీణావాణీలతో పాటు వారి తల్లిని లండన్ తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
గతంలో అవిభక్త కవలలుగా జన్మించిన ముగ్గురిని వేరు చేసిన ఘన చరిత్ర ఈ వైద్యులకు ఉండటంతో వీణా-వాణీలకు ఖచ్చితంగా విముక్తి కల్పిస్తారనే ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ శస్త్రచికిత్సను నాలుగైదు దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు ఏడాది కాలం పట్ట వచ్చని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు.
అలాగే ఆపరేషన్ ఖర్చు సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లు ఉంటుందని ఇందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవిభక్త కవలలైన వీణా-వాణీలకు మెదడు, రక్త కణాలు కలిసి ఉండటం వల్ల వీరిని విడదీయడం సాధ్యం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే శస్త్ర చికిత్స ద్వారా ఇద్దరు చిన్నారులు బతకాలని వైద్యబృందం కోరుతోంది.
వీణావాణీలను వైద్యులు 2009లో పరీక్షించారు. అయితే, ఆ సమయంలో శస్త్రచికిత్సకు ఏదో కారణంతో తండ్రి నిరాకరించాడు. లండన్ వైద్యులు అటువంటి శస్త్రచికిత్సనే చేసి విజయం సాధించడంతో ఇప్పుడు మళ్లీ వారికి శస్త్ర చికిత్స చేసే విషయం తెర మీదికి వచ్చింది. వీణా వాణీలను వేరు చేసి, వారికి ఉత్తమ భవిష్యత్తును వైద్యులు అందించగలరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
తలలు అతుక్కుపోయి 11 నెలలుగా వీణా వాణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2011లో ఆ లండన్ వైద్యులు గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రిలో సూడాన్కు చెందిన రిటాల్, రిటాగ్ (ఏడాది వయస్సు) అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేశారు. రెండు రోజుల పాటు వీణావాణీలను వైద్య బృందం క్షుణ్నంగా పరీక్షిస్తుంది. తద్వారా శస్త్రచికిత్స ద్వారా వారిని విడదీసేందుకు అవకాశం ఉంటుందా, లేదా అనే విషయాన్ని తేల్చి చెబుతుంది.