భారీ హెచ్చరిక: ఏపీకి మరో వాయుగుండం
వర్షాలు, వరదలతో విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవి వదిలిపెట్టేలా కనపడటంలేదు. బంగాళాఖాతంలో సెప్టెంబరు మూడోవారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశాలున్నాయని, ఈ ప్రభావంతోనే ఈనెల చివరివారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఐదు డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
వర్షాలు శాంతించడంతో ఉష్ణోగ్రతలు తమ ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుపతి, కడప, కావలి, నెల్లూరు, బాపట్ల, గన్నవరం, నరసాపురం, కాకినాడ, తుని, విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు ఐదు డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. రుతుపవన విరామంవల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తంమీద బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఒడిసావద్ద తీరం దాటిన వాయుగుండం
ఈరోజు చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు ముప్పుగా పరిణమించిన వాయుగుండం ఒడిసావద్ద తీరం దాటింది. చత్తీస్ గడ్ మీదుగా మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించి అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఏపీలో గోదావరిలో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆకస్మికంగా వరదలు రావడానికి అవకాశం ఉందని హెచ్చరించింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి రోజురోజుకు నీటిమట్టం పెరుగుతోంది.












Click it and Unblock the Notifications