ముంచుకొస్తున్న ముప్పు...రెండు సముద్రాల్లో రెండు తుఫాన్లు:బంగాళాఖాతంలో "తితలీ"...అరేబియాలో "లుబన్"
విశాఖపట్టణం:రెండు వైపుల నుంచి రెండు సముద్రాల్లో ముంచుకొస్తున్న రెండు తుఫాన్లు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం...అటు అరేబియా సముద్రం రూపుదిద్దుకున్న ఈ తుఫాన్లు ఏ స్థాయిలో విరుచుకుపడతాయోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. దీనికి "తితలీ" అని నామకరణం చేయనున్నారు. పశ్చిమ, దానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి "లుబన్" అని ఒమన్ దేశం నామకరణం చేసింది.
ఎపిలో ఐటి దాడులు:నిజమా?....అసలు సినిమా ముందుందా?...అధికారులే అంటున్నారట!
రెండు సముద్రాలు...రెండు తుఫాన్లు
అరేబియా సముద్రంలో ఇప్పటికే తుఫాన్ "లుబాన్" ఏర్పడగా...బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుపాను "తితలీ" ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన లుబాన్ తుఫాన్ మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్ తీరం దిశగా కదులుతోంది.
అరేబియా సముద్రం...లుబాన్ తుఫాన్
అరేబియా సముద్రంలో ఈనెల 10 నాటికి తుఫానుగా మారనున్న "లుబాన్" అని ఒమన్ నామకరణం చేసింది. పశ్చిమ వాయవ్యం దిశగా ఒమన్ తీరం దిశగా కదులుతున్న ఈ తుఫాన్ మరో నాలుగైదు రోజుల్లో ఒమన్ పరిసరాల్లో తీరం దాటవచ్చని, ఆ క్రమంలో తీవ్ర పెనుతుఫానుగా మరింత బలపడనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతం...తితలీ తుఫాన్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయుగుండం ఏర్పడగా...ఇది మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి,బుధవారం తుపానుగా మారుతుందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలో మంగళవారం రాత్రి నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.బంగాళాఖాతం తుపాను"తితలీ"ఎంత ప్రభావం చూపుతుందనేది...అరేబియా తుపాను "లుబాన్"పై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రెండు తుఫాన్లు...ప్రభావాలు
అయితే రెండు సముద్రాల్లో రెండు తుఫాన్లు ఏర్పడటం అసాధారణ విషయమేమీ కాదంటున్నారు వాతావరణ నిపుణులు. లుబాన్ తుపాను ఒమన్ వైపు వెళ్లిపోయి బలహీనపడితే బంగాళాఖాతంలోని తుపాను బలపడుతుందన్నారు. దీని ప్రభావం తో రెండు మూడు రోజులు కోస్తా, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖపట్నం,మచిలీపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కొనసాగుతున్నందున...ఈ నెల 11 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని...మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. ఇదిలావుండగా సోమవారంతో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ పూర్తయిందని, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాల తాకిడి ప్రారంభమైందని ఐఎండి తెలిపింది.