మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకొని కూర్చోలేదు??
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తామంటూ గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పిన్నెల్లి బెదిరిస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన బ్రహ్మారెడ్డి రామకృష్ణారెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా పిన్నెల్లి భరించలేకపోతున్నారని, అలాంటప్పుడు మంచి పనులు చేయవచ్చుకదా అన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును, తనను వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సమాధానం చెప్పడం తమకు కూడా వచ్చని, కానీ తమ పార్టీ నేర్పించిన సంస్కారం దానికి అడ్డు వస్తోందన్నారు. పిన్నెల్లి అవినీతి, అరాచకాలపై బహిరంగచర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, రాజకీయాల్లో విమర్శలు చేయకూడదు అంటే పరిశుద్ధంగా పరిపాలన చేయాలని హితవు పలికారు.