మదనపల్లె జంట హత్యల కేసు: పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, అందర్నీ షాక్ కు గురి చేసిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన కుమార్తెల జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం నాయుడు ,పద్మజ లకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు . మదనపల్లె జంట హత్యల కేసులో మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన భార్యాభర్తలిద్దరూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని వైద్యులు నిర్ధారించి, వారిని విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు
ఇటీవల వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు . తాజాగా కుమార్తెల జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం నాయుడు, పద్మజ లపై కేసు నమోదై 90రోజులు పూర్తి కావటంతో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మదనపల్లెలో జనవరి 24 న మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్ళను హతమార్చిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు వింతగా ప్రవర్తించటం , తానే కాళికనని , తన కుమార్తెలు తిరిగి బ్రతికొస్తారని చిత్ర విచిత్రంగా ప్రవర్తించటంతో వారిని అరెస్ట్ చేసి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఇక మానసిక ఆరోగ్య పరిస్థితి బాగా లేదని గుర్తించిన మదనపల్లె జైలు అధికారులు వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు .
వైద్యులు వారిని విశాఖ మెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచాలని చెప్పారు . మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన దంపతుల ఆరోగ్యం మెరుగుపడటంతో వారు ఇటీవల విశాఖ మెంటల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. వారిని చిత్తూరు పోలీసులు మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం భార్యాభర్తలు ఇరువురూ పశ్చాత్తాపానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇద్దరి మానసిక పరిస్థితి మెరుగు పడిన కారణంగా పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు . ఇక తాజాగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చెయ్యటంతో పురుషోత్తం నాయుడు , పద్మజ దంపతులు బయటకు రానున్నారు .