నిర్వాసితుల మహా ధర్నా, సొమ్మసిల్లిన మాజీ ఎంపి: బాబుకు చిక్కులేనా...
తమకు న్యాయం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా జరిగింది. పోలవరం ప్రాజెక్టు కింద ఆ మండలాల ప్రజలు సర్వం కోల్పో పరిస్థితి ఉంది.
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బంది లేకుండా తెలంగాణకు చెందిన మండలాలను ఏడింటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. అయితే ఆ విలీన మండలాల సమస్యలు మాత్రం తీరడం లేదు. పోలవరం ప్రాజెక్టును 2018 లోగా నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
కానీ విలీన మండలాల నిర్వాసితులకు మాత్రం న్యాయం జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా జరిగింది. పోలవరం ప్రాజెక్టు కింద ఆ మండలాల ప్రజలు సర్వం కోల్పో పరిస్థితి ఉంది.
ఆందోళనకారులు చింతూరు మండలం చట్టి వద్ద 30వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ట్రాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమానికి అఖిలపక్షం మద్దతు పలికింది. పోలవరం నిర్వాసితుల సమస్యలు చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెడుతాయా అనే సందేహం కలుగుతోంది.
ముందుగా ర్యాలీ....
ముందుగా చింతూరు నుంచి చట్టి వరకూ నిర్వాసితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత చట్టి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మండుటెండలో మూడు గంటలపాటు దిగ్బంధ కార్యక్రమం సాగటంతో మాజీ ఎంపీ మిడియం బాబూరావు సొమ్మసిల్లి పడిపోయారు. కొద్దిసేపటికి కోలుకుని తిరిగి ఆయన ఆందోళనలో పాల్గొన్నారు.
Recommended Video
చంద్రబాబుపై ధ్వజమెత్తిన సున్నం రాజయ్య...
విలీన మండలాల ప్రజల త్యాగాలవల్లే పోలవరం నిర్మాణం జరుగుతోందని చెప్పిన చంద్రబాబు, నేడు వారిని మాయమాటలతో ముంచేస్తున్నారని మహాధర్నాకు నాయకత్వం వహించిన ఎమ్మెల్యే సున్నం రాజయ్య ధ్వజమెత్తారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న చంద్రబాబు, నేటికీ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించక పోవడమేమిటని ప్రశ్నించారు.
పునరావాసం కల్పించిన తర్వాతే...
నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సిపిఎం నేతలు అరుణ్, మిడియం బాబూరావు, కృష్ణమూర్తి డిమాండు చేశారు. ప్రభుత్వ మాయమాటలకు నిర్వాసితులు విసిగిపోయారని, ఇక తిరుగుబాటు బావుటా ఎగరేయక తప్పదని అన్నారు. 2019 డిసెంబర్ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూడు గంటల పాటు దిగ్బంధం...
మూడు గంటల పాటు దిగ్బంధం నిర్వహించడంతో రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను కలిసిన ఐటిడిఎ పిఒ చినబాబు, భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే, 17, 18 తేదీల్లో విలీన మండలాల బంద్నకు సిపిఎం పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సిహెచ్ మురళి, కొమరం పెంటయ్య, కారం శిరమయ్య, శేషావతారం తదితరులు పాల్గొన్నారు.