అద్దంలో ముఖం చూస్కున్నావా, ఏపీకి ఎంత తెచ్చావ్: బాబు-లోకేష్లపై తలసాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రీ, కొడుకుల (చంద్రబాబు, లోకేష్) పొగడ్తలకే మహానాడు అన్నారు.
హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమన్నారు. అసలు బాబు ఎప్పుడైనా తన మొహన్ని అద్దంలో చూసుకున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు ఏడాదిలో ఏపీకి ఎంత సంపద తెచ్చారో చెప్పాలని నిలదీశారు.
ఏడాది గడిచినా చంద్రబాబు నాయుడు హైదరాబాదును వదిలి వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం మినహా ఏం చేయడం లేదన్నారు. లోకేష్ ఓ ట్విట్టర్ పిట్ట అని మండిపడ్డారు.
ఎర్రబెల్లిని ఆపింది నేనే: కడియం
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారంటూ కొన్ని నెలల కిందడ వార్తలు వచ్చాయని, ఆ తర్వాత ఆ వార్తలు సద్దుమణిగాయని, ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారని, ఆయన తెరాసలో చేరకుండా అడ్డుకుంది తానేనని మంత్రి కడియం శ్రీహరి వేరుగా అన్నారు.
ఎర్రబెల్లి తెరాసలోకి రావాలనుకున్న మాట వాస్తవమే అన్నారు. కానీ ఆయన తెరాసలో చేరకుండా తానే అడ్డుకున్నానని చెప్పారు. తెలంగాణ ద్రోహులకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎప్పటికీ చోటు ఉండదని చెప్పారు. తమ పార్టీని విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు.