అమరావతి రైతుల మహాపాదయాత్రకు మహారాష్ట్ర రైతుల సంఘీభావం, 41వరోజు అడుగడుగునా జననీరాజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగించాలన్న నినాదంతో అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి ప్రాంత రైతులు అమరావతి ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా, అలాగే న్యాయస్థానంలో న్యాయం జరగాలని, దేవస్థానం ద్వారా ధర్మం గెలవాలని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగాలని సంకల్పించిన మహాపాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.

41వ రోజు పాదయాత్రకు జననీరాజనం
45 రోజులపాటు మహా పాదయాత్ర చేపట్టిన రైతులు నవంబర్ 1వ తేదీన తుళ్లూరులో మహా పాదయాత్ర ప్రారంభించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పాదయాత్ర నిర్వహించి తిరుమలకు చేరుకుంటారు. అడుగడుగునా ఇబ్బందులు, పోలీసుల ఆంక్షల మధ్య అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు 41వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతుంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. దారిపొడవునా అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. రైతుల పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు.

అంజిమేడులో ముగియనున్న రాజధాని కోసం మహా పాదయాత్ర
రాజధాని కోసం సాగిస్తున్న పోరాటం విజయం సాధిస్తుందని, ఖచ్చితంగా ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సాగుతున్న పాదయాత్ర 17 కిలోమీటర్ల మేర సాగి అంజిమేడు వద్దకు చేరుకోవడంతో ముగిస్తుంది. చిత్తూరు జిల్లా రాచగున్నేరిలో రైతులు భోజన విరామాన్ని ఇవ్వనున్నారు. ఆపై అంజిమేడు వద్ద పాదయాత్ర ముగుస్తుంది. ఇక ఈ రోజు సాగుతున్న మహా పాదయాత్రకు సైతం ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులకు స్థానిక మహిళలు పసుపు, కుంకుమ ,తాంబూలం ఇచ్చి రాజధాని కోసం సాగిస్తున్న పోరాటం కొనసాగించాలని చెప్పారు.

రైతులకు మద్దతు తెలిపిన మహారాష్ట్ర రైతులు .. చరిత్రలో నిలిచిపోతుందని కితాబు
ఇక నిన్నటికి నిన్న కర్ణాటక నుండి వచ్చిన ప్రవాసాంధ్ర రైతులు రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించి 60 లక్షల రూపాయల విరాళం ఇవ్వగా, ఈరోజు మహారాష్ట్ర నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ముఖ్యంగా పూణే, పింప్రీ, చించువాడ్, బోసారి ప్రాంతాలనుండి వచ్చిన రైతులు అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారు కూడా రాజధాని రైతుల పోరాటానికి అండగా ఉంటామని వెల్లడించారు. రైతుల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కితాబిచ్చారు. సాటి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి తాము వారికి మద్దతుగా ఉండడానికి వచ్చామని మహారాష్ట్ర రైతులు వెల్లడించారు.

డిసెంబర్ 17 రైతుల బహిరంగ సభపై టెన్షన్
ఇదిలా ఉంటే రాజధాని రైతులు సాగిస్తున్న మహాపాదయాత్ర డిసెంబర్ 15వ తేదీన తిరుమలకు చేరుకోనుంది. ఆ తర్వాత డిసెంబర్ 17వ తేదీన తిరుపతిలో రైతులు భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి నిరాకరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులు తిరుపతిలో తాము నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను కొనసాగించడం కోసం కోర్టు మెట్లు ఎక్కుతామని ఇప్పటికే తేల్చి చెప్పారు. మరో తిరుపతిలో అమరావతి రైతుల సభపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications