శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - స్పర్శ దర్శనంలో మార్పులు..!!
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆలయంలో దర్శన వేళల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రద్దీ రోజుల్లో నూ సర్పదర్శనం కల్పించేలా అధికారులు నిర్ణయించారు.
శ్రీశైలం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ఈవో ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. కైలాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అటవీశాఖ సహకారంతో భీమునికొలను మెట్లమార్గం, కైలాస ద్వారం వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు వీలైనంత చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఫిబ్రవరి 19న ఉత్సవాలు మొదలవునున్నా.. పాదయాత్రగా వచ్చే భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి వస్తారని పేర్కొన్నారు. దీంతో, ఇందుకు అనుగుణంగా పనులు ముందుగానే పూర్తి చేయాలని నిర్దేశించారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి తొలివారం వరకే పనులన్నీ పూర్తవ్వాలని చెప్పారు. అలాగే అన్నదానం చేసే భక్తబృందాలకు దేవస్థానం తరఫున సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇదే సమయంలో భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మామూలుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుంది. పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో, వారంతరాల్లో మాత్రం స్పర్శ దర్శనానికి అనుమతి ఉండదు. కాగా, ఇక నుంచి ఎప్పుడూ స్వామి వారి స్పర్శ దర్శనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతలు అలంకార దర్శనం, మూడు విడతలు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. శని, ఆది, సోమవారంతో పాటు సెలవులో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం కలిగిస్తూ నిర్ణయించారు. అలాగే ఈ సర్పదర్శనానికి గతంలో మాదిరిగానే టికెట్లు ఆన్లైన్ ద్వారానే పొందేలా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications