జగన్కు షాక్: తప్పుకున్న అభ్యర్థి, రత్తయ్య చేరిక
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. మహేశ్వరం శాసనసభా నియోజకవర్గం పార్టీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇది మరో ఎదురు దెబ్బగనే చెప్పాలి.
కాంగ్రెసు పార్టీకి నష్టం జరగకుండా చూడడానికే భాస్కర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు. తాజా పరిణామంతో తెలంగాణలోని పార్టీ అభ్యర్థులతో వైయస్ జగన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరికొంత మంది అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకుంటారనే ప్రచారం నేపథ్యంలో జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా, చింతలపూడి మాజీ శాసనసభ్యుడు ఘంటా మురళీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇదిలావుంటే, గుంటూరు జిల్లాకు చెందిన విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత రత్తయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రత్తయ్యతో పాటు ఎన్టీ రామారావు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి జగన్ నివాసానికి వచ్చారు.
తాను టికెట్ ఆశించి వైయస్సార్ కాంగ్రెసులో చేరలేదని విజ్ఞాన్ రత్తయ్య అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం కావాలని, అందుకే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరానని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయానికి పాటుపడుతానని చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సహజత్వాన్ని కోల్పోయిందని, కాంగ్రెసు వలసలతో ఆ పార్టీ నిండిపోయిందని రత్తయ్య అన్నారు.