పీడీసీసీబి ఛైర్మెన్ ఈదర మోహన్కు పదవీ గండం: మెజారిటీ డైరెక్టర్ల అసంతృప్తి?
ఒంగోలు: ఒంగోలు కేంద్ర సహకార బ్యాంకు చైర్మెన్ ఈదర మోహన్ను తప్పించాలని మెజారిటీ డైరెక్టర్లు పట్టుబడుతున్నారు. బ్యాంకు ఛైర్మెన్ మోహన్పై డైరెక్టర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహరాన్ని పరిష్కరించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు టిడిపి జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్ధన్ను ఆదేశించారని సమాచారం.
ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మెన్ పదవి నుండి ఈదర మోహన్ను తప్పించాలని మెజారిటీ డైరెక్టర్లు పట్టుబడుతున్నారని ప్రచారం సాగుతొంది. ఈ మేరకు ఈదర మోహన్పై కొందరు డైరెక్టర్లు మీడియాకు ప్రకటనలు ఇవ్వడం సంచలనం కల్గిస్తోంది.
పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్బాబుపై బ్యాంక్ డైరెక్టర్లు తాజాగా 27 అంశాలకు సంబంధించి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు గురువారం ఒంగోలులోని మీడియా కార్యాలయాలకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైస్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఆర్.వెంకట్రావు, చిడిపోతు మస్తానయ్య, గండికోట చినవీరయ్య, జాగర్లమూడి యలమందరావు, కె.మురహరి, మేణావత్ హనుమాన్నాయక్ సంతకాలతో ఈ ప్రకటన జారీ చేసిసట్టు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఈదర మోహన్ను తప్పిస్తారా?
ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) రగడ పతాకస్థాయికి చేరింది. ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకులో రూ.25 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, బోర్డు సభ్యులను వంచించి చైర్మన్, సీఈఓ కొందరు అక్రమాలకు పాల్పడ్డారని 14 మంది పీడీసీసీబీ డైరెక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సహకార శాఖ మంత్రి, కమీషనర్, జిల్లా ఎస్పీతో పాటు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. చైర్మన్ ఈదరను పదవీచుతుడ్ని చేయాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు. దీంతో మోహన్ను తప్పిస్తారా అనే చర్చ సాగుతోంది.

చంద్రబాబు వద్దకు చేరిన పంచాయితీ
ఈదర మోహన్ టిడిపి మద్దతుదారుడు.సొంత పార్టీకి చెందిన మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టడం కలకలం రేపుతోంది. టిడిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్తో ఈదర మోహన్కు సత్సంబంధాల్లేవు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. డీసీసీబీ వ్యవహారాన్ని బుధవారం రాత్రి ఎమ్మెల్యే జనార్దన్తో పాటు మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహరాన్ని పరిష్కరించాలని చంద్రబాబునాయుడు దామరచర్ల జనార్థన్ను ఆదేశించారని సమాచారం.

ఎమ్మెల్యేలు ఈదరకు మద్దతిస్తారా?
ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్లలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులున్నారు. అయితే 20 మంది డైరెక్టర్లలో దాదాపు 17 మంది డైరెక్టర్లు ఈదరను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన్ను పదవి నుంచి దించాలని డిమాండ్ చేస్తున్నారు.డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చే పక్షంలో ఈదర పదవి నుంచి తప్పుకోవడం మినహా గత్యంతరం లేదు. అదే జరిగితే శుక్రవారం సాయంత్రానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది.టీడీపీ అధిష్టానం ఈదరనే చైర్మన్గా కొనసాగించే పక్షంలో ఎమ్మెల్యేల ద్వారా డైరెక్టర్లపై ఒత్తిడి పెంచి సమస్యను సర్దుమణిగేలా చేసే అవకాశం ఉంది.

దామరచర్ల జనార్థన్ ఏం తేలుస్తారో
ఈ విషయాన్ని పరిష్కరించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు టిడిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్ను ఆదేశించారు. దీంతో జనార్దన్ శుక్రవారం డీసీసీబీ వివాదంపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఈదర మోహన్ ఎట్టి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని గతంలో వైస్ చైర్మన్గా ఉన్న మస్తానయ్యతో పాటు 15 మంది డైరెక్టర్లు పట్టుపడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన చైర్మన్గా ఈదరను అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం దామచర్ల వద్ద జరిగే పంచాయితీలోనూ ఇదే చెబుతామని పలువురు డైరెక్టర్లు అంటున్నారు.ఈదర మోహన్ అధికార పార్టీ మద్ధతుదారుడిగానే కొనసాగుతున్నందున డైరెక్టర్లను ఒప్పించి చైర్మన్గా ఈదరను కొనసాగించేలా రాజీ ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఈదర మోహన్పై ఆరోపణలివీ
ఈదర మోహన్పై డైరెక్టర్లు అవినీతి ఆరోపణలు చేశారు.తన ఇష్టానికి అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ 8 మంది బ్యాంకు సీఈఓలను మార్చారని డైరెక్టర్లు ఆరోపణలు చేశారు. బ్యాంకులో లాకర్లు, సేఫ్ డోర్లు నాణ్యమైనవి కొనుగోలు చేయాల్సి ఉండగా నాసిరకంవి కొని నాణ్యమైన వాటి ధరకన్నా అధిక మొత్తం చెల్లించారని డైరెక్టర్లు ఆరోపించారు.నగదు కౌంటింగ్ మెషీన్లను రిపేరు చేయించకుండా కొత్తవి కొనుగోలు చేయడంలోనూ రూ.60 లక్షలు చేతులు మారిందని డైరెక్టర్లు ఆరోపించారు.గుంటూరు పాలకవర్గ సమావేశంలో పాలకవర్గ ధన దుర్వినియోగాలపై జరిగిన విచారణ నివేదిక ద్వారా పాలకవర్గ సభ్యులను బాధ్యులను చేయడం వల్ల.. తాము కూడా అలా బాధ్యులం కాగలమని భావించి మోసపూరిత అంశాలను కనుగొన్నామని డైరెక్టర్లు ప్రకటించారు. బ్యాంక్ చైర్మన్పై తమ నమ్మకం వమ్ము అయిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications