పార్టీలు ఎవరికి వారే: తెలంగాణలో సీమాంధ్ర ఎటు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్రుల పైన కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఎక్కువ మంది సీమాంధ్రులు ఉన్నందువల్లే ఆ నియోజకవర్గం పైన పలువురు నేతల కన్ను పడుతోంది.
మల్కాజిగిరి నుండి జగన్ పార్టీ తరఫున షర్మిల, లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తదితరులు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డిఎల్ రవీంద్రా రెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపించాయి. తెలంగాణలో మల్కాజిగిరితో పాటు ఇతర పలు జిల్లాల్లోను సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు. వారి పైన టిడిపి, జగన్ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
అయితే కాంగ్రెస్, టిడిపి-బిజెపి కూటమిలో ఒక పార్టీని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణలోని సీమాంధ్రులు కాంగ్రెస్నే ఆదరిస్తారని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం తెలంగాణలో 50లక్షల మంది వరకు సీమాంధ్రులు ఉంటారని సీమాంధ్ర నాయకులు శ్రీకృష్ణ కమిటీకి వివరించించారు.
సీమాంధ్ర
తెలంగాణ ఘనతపై కాంగ్రెసు, తెరాసలు పోట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తమకు తెరాస వల్ల ఇబ్బంది ఎదురైనా సీమాంధ్రుల మద్దతుతో గట్టెక్కుతుందని తెలంగాణ కాంగ్రెసు భావిస్తోందట. ఇక నిజామాబాద్ జిల్లాలో నిజాం కాలంలోనే సీమాంధ్ర రైతులు స్ధిరపడ్డారు, కొన్ని గ్రామాల్లో వారి సంఖ్య గణనీయంగా ఉంది.
సీమాంధ్ర
అయితే 2001లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో తెరాస గెలిచిన రెండు జిల్లా పరిషత్తుల్లో నిజామాబాద్ ఒకటి. విస్తరించిన హైదరాబాద్ మహానగరంలోనే సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉంది. పాత హైదరాబాద్లో ముస్లింలు, స్థానికులు, తెలంగాణకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
సీమాంధ్ర
మల్కాజగిరి లోకసభ పరిధిలో మేడ్చెల్ మినహాయించి ఇతర అసెంబ్లీల్లో సీమాంధ్రులు గణనీయంగా ఉన్నారు. శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో సీమాంధ్రులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. శివారు ప్రాంతాల్లోని ఈ నియోజక వర్గాల్లో సీమాంధ్రులు తమకే వేస్తారని టిడిపి ఆశలు పెట్టుకొంది.
సీమాంధ్ర
చివరి వరకు సమైక్యాంధ్ర వాదాన్ని బలంగా వినిపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఈ ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉంది. కచ్చితంగా తమ వారు గెలుస్తారనుకుంటే లోక్సత్తా, టిడిపి, జగన్ పార్టీలను ఆయా ప్రాంతాలలో సీమాంధ్రులు ఆదరించే అవకాశం ఉందంటున్నారు.
సీమాంధ్ర
అంత బలంగా లేని నియోజక వర్గాల్లో మాత్రం సీమాంధ్ర ఓటర్ల వైఖరి వేరుగా ఉండే అవకాశం ఉంది. స్థానిక నాయకులను బట్టి లేదా తెరాస, టిడిపి, కాంగ్రెసు, బిజెపిల వైపు ఎటైనా మొగ్గు చూపవచ్చునంటున్నారు. అంతేకాకుండా అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే దానిపై ఓ అంచనాకు వచ్చి వారు మొగ్గు చూపవచ్చునంటున్నారు.