బీజేపీకి షాకిద్దాం, కోల్కతాకు రండి: బాబు-కేసీఆర్లకు మమత, ఇద్దరూ ఓకే!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆదివారం లేఖ రాశారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, రావాలని ఆ లేఖలో కోరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా తాము నిర్వహించే ఈ భారీ ప్రదర్శనకు హాజరు కావాలని చంద్రబాబును కోరారు. వచ్చే ఏడాది లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను సంఘటితం చేసి, ఆ శక్తిని ఎన్డీయేకు చూపించాల్సి ఉందని, అందుకే ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
జనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదన
ఆ బాధ్యత మనందరి పైనా ఉంది
ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆమె పేర్కొన్నారు. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు.
కీలక సమావేశాలకు వేదికైన బ్రిగేడ్ పరేడ్
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదిక అవుతుందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ సాక్ష్యంగా నిలిచిందని, అక్కడే ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
మీరు పాల్గొంటే దేశ ఐక్యత, సమైక్యత బలోపేతానికి దోహదం
కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ నుంచి అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దామని మమతా బెనర్జీ ఏపీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం ద్వారా దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబుతో పాటు ఒమర్, కేసీఆర్లకు ఆహ్వానం
చంద్రబాబుతో పాటు ఈ ర్యాలీలో పాల్గొనాలని మమతా బెనర్జీ పలువురు నేతలకు లేఖలు రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులకు లేఖ రాశారు. ఈ ర్యాలీకి వచ్చేందుకు చంద్రబాబు, కేసీఆర్, ఒమర్లు అంగీకరించారని తెలుస్తోంది. అలాగే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను ఆహ్వానించనున్నారు. జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేల్లతో పాటు వామపక్ష నేతలను కూడా ఆహ్వానించనున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్ను ఆహ్వానించనున్నారు.