షాకింగ్.. ఇగో వదిలేయండి: చంద్రబాబుపై మమత ఒత్తిడి, సోనియా గాంధీ సిద్ధం? జగన్పై దీదీ ఇలా
అమరావతి/న్యూఢిల్లీ: గతంలో ఏదైనా విభేదాలు ఉంటే మరిచిపోవాలని, ఇగోను వదిలేయాలని ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారట. ఈ మేరకు కథనాలు వస్తున్నాయి. 2014 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని ఉప ఎన్నికల్లో తప్పితే బీజేపీ దూసుకెళ్తోంది.
Recommended Video
బాగుంది: నరేంద్ర మోడీ ఎదుట ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చిన సింగపూర్ ప్రధాని
ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టి బీజేపీ ఓటమికి కృషి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన కైరానా ఉప ఎన్నికల్లో అయిదు పార్టీలు కలిసి ఆర్ఎల్డీ అభ్యర్థికి తబస్సుంకు మద్దతిచ్చాయి. దీంతో బీజేపీ ఓడిపోయింది. బీజేపీని ఓడించేందుకు ఆరు పార్టీలు కలవడం తదితర ఎన్నో కారణాలు ఉన్నాయని, అయినప్పటికీ తాము కేవలం 50వేల మెజార్టీకి అటు ఇటుగా ఓడిపోయామని కమలం శ్రేణులు చెబుతున్నాయి.
ఒక్కటవుతున్న విపక్షాలు
గత కొన్నాళ్లుగా బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల నాటికి బీజేపీని కేంద్రంలో గద్దె దించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర ఎన్నో పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి చంద్రబాబు, సోనియా, రాహుల్ గాంధీ, మమతా, ఏచూరీ వంటి వారు హాజరయ్యారు.
ఒకే వేదికపై రాహుల్, చంద్రబాబు
కాంగ్రెస్ - టీడీపీలు మూడున్నర దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉంటున్నాయి. కానీ కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు - రాహుల్ గాంధీలు చేయి కలపడం, భుజం తట్టడం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై టీడీపీ ఎంతగా వివరణ ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ - టీడీపీలు దగ్గరవుతున్నాయని తేలిపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మోసం చేసిందని, సోనియా గాంధీతో ఏమైనా వ్యక్తిగత వైరం ఉందా అని ప్రశ్నించారు.
మమతా బెనర్జీ సూచన
కాంగ్రెస్ పార్టీతో తాము ఎట్టి పరిస్థితుల్లోను జతకట్టేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ లోలోన వీరిద్దరిని ఓ తాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీలపై మమత ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ - టీడీపీ గ్రాండ్ అలయెన్సుగా, లెఫ్ట్ పార్టీలతో కలవాలని చెబుతున్నారట.
తెలంగాణ, ఏపీలలో ఇదీ లెక్క
మమతా బెనర్జీ చేసిన సూచనకు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సుముఖతతో కూడా ఉన్నారట. విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినప్పటికీ గట్టి కేడర్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తుతో ఏపీలో టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.
ఇగో వదిలేయాలని మమత సూచన
బీజేపీని ఓడించేందుకు ఎలాంటి ఇగోలు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబుపై మమత ఒత్తిడి తెస్తున్నారట. మమత ఒత్తిడి కారణంగానే చంద్రబాబు.. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏమంటే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా మమతకు సమాచారం అందిందని అంటున్నారు. ఏపీలో బీజేపీని ఓడించేందుకు గ్రాండ్ అలెయన్స్ జతకడితే బీజేపీ లేదా వారికి అనుకూలంగా ఉన్న పార్టీలను దెబ్బతీయవచ్చుననేది మమత సూచన అంటున్నారు. అయితే ఏపీ, తెలంగాణలలో బీజేపీ ప్రభావం అంతగా లేదనే విషయం గుర్తించాలని కొందరు అంటున్నారు.
నాడు ఎన్టీఆర్ కూడా కాంగ్రెస్కు దగ్గరవ్వాలనుకున్నారా?
ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఎన్టీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని చూశారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ అసోసియేట్ ఉపేంద్ర రాసిన పుస్తకంలో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు తన నుంచి పార్టీని లాక్కున్న అనంతరం నాటి ప్రధాని పీవీ నర్సింహా రావుకు ఎన్టీఆర్ ఓ ప్రతిపాదన పంపించారని, టీడీపీ లోకసభ ఎంపీలు కాంగ్రెస్కు అండగా ఉంటారని, ఏపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతివ్వాలనేది ఆ ప్రతిపాదనగా ఉందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని పేర్కొన్నారు.