మరిదిని హత్య చేసి ఆత్మహత్యగా: అరెస్ట్(ఫొటోలు)
తిరుపతి: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు తనకు శిక్ష పడకుండా తప్పించుకునేందుకు బావమరిదిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ దుర్మార్గుడు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం తేలడంతో నిందితుడు ఏడాది తర్వాత అరెస్టైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు అలిపిరి సిఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.
స్థానిక సంజయ్ గాంధీ కాలనీకి చెందిన వైద్యలింగానికి వి కుమార్ అనే కుమారుడు, లలితమ్మ అలియాస్ లలిత అనే కుమార్తె ఉన్నారు. రేణిగుంటకు చెందిన బండారు వెంకటేష్కు వైద్యలింగం తన కుమార్తె లలితను ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే లలిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో చెల్లెలి మృతికి బావ బండారు వెంకటేష్, అతని తల్లి సుమతియే కారణమంటూ లలిత తమ్ముడు వి కుమార్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బండారు వెంకటేష్ కుటుంబంపై వరకత్న కేసు నమోదు చేశారు.
కాగా, కేసును ఉపసంహరించుకోవాలని వెంటేష్.. బావమరిది కుమార్ను కోరాడు. అయితే అందుకు కుమార్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటేష్ తన బావమరిది కుమార్ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు 2014, మార్చి 10న ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న కుమార్ను వెంకటేష్ తనపాటు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత మంగళంలోని చెన్నాయగుంట వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాలతో కుమార్ను కొట్టి చంపాడు వెంకటేష్.
అనంతరం ఆటోలో తీసుకెళ్లి శెట్టిపల్లె రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద అదే రోజు రాత్రి 9గంటలకు రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. స్థానికుల సమాచారంతో శవాన్ని గుర్తించిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బండారు వెంకటేష్, అతనికి సహకరించిన మావిళ్ల కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.