కిలాడీ దంపతులు: ధనవంతులను బురిడీ కొట్టించి రూ. కోట్లలో మోసం
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థ స్థాయిలో కార్యాలయం, ఖరీదైన ఫర్నీచర్తో తమ వద్దకు వచ్చేవారిని నమ్మించి రూ. కోట్లలో మోసం చేసిన ఇద్దరు కిలాడీ దంపతుల గుట్టురట్టయింది. బాధితుల ఫిర్యాదుతో పరారైన సదరు దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, కిలాడీ దంపతులలో భర్త పోలీసులకు చిక్కగా, భార్య మాత్రం పరారీలోనే ఉంది.
వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని బండ్లమిట్టకు చెందిన కానుగుల శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గోనవారి పల్లె గ్రామానికి చెందిన సురేఖ దంపతులు విదేశీ సంస్థలో పెట్టుబడి పేరుతో ధనిక వర్గాల ప్రజలను మోసం చేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 71లోని నవ నిర్మాణ్నగర్లో కొద్ది కాలం క్రితం ఓ ఖరీదైన ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు.
ఆ ఫ్లాట్లో గ్రీన్వాల్డ్ గ్లోబల్ పేరుతో కార్యాలయాన్ని తెరిచారు. తమ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూజిలాండ్లో ఉందని, దానికి తాను ఆంధ్రప్రదేశ్ శాఖకు మేనేజర్ అని శ్రీనివాసరావు నమ్మబలికేవాడు. సురేఖ కూడా కంపెనీ ప్రతినిధిని అనే చెప్పుకునే వారు. న్యూజిలాండ్లో కార్పొరేట్ స్థాయిలో తమకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పేవారు.
పెట్టుబడి పెట్టే వారికి 10 శాతం లాభం వస్తుందని ప్రచారం చేశారు. ఇది నమ్మిన బంజారాహిల్స్ రోడ్డు నెం. 12కు చెందిన ఎస్కే మస్తాన్ తనతో పాటు బంధువులు, మిత్రులతో కలిసి 53 లక్షల రూపాయలు చెల్లించాడు. మూడు నెలల పాటు సక్రమంగానే కమీషన్ అందజేశారు. ఆ తరువాత ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీనివాసరావు దంపతులను నిలదీశారు. కాగా, 2014 ఆగస్టు 3వ తేదీన శ్రీనివాసరావు బోర్డు తిప్పేసి పరారయ్యాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాలా రోజుల వరకు దంపతులు పోలీసులకు చిక్కలేదు. బాధితుల సంఖ్య మాత్రం పెరిగిపోయి దాదాపు పది కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డట్టు తేలింది. చివరకు ఏప్రిల్లో బంజారాహిల్స్ పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేశారు. సురేఖ ఇంకా పరారీలోనే ఉన్నట్లు సమాచారం.
సురేఖ గతంలో కూడా సినిమా వేషాల పేరిట నగరానికి వచ్చి ఓ నిర్మాతతో కలిసి పరిచయాలు పెంచుకుందని బాధితులు తెలిపారు. అనంతరం శ్రీనివాసరావును వివాహం చేసుకున్నాక తనకు పరిచయమైన వారిని పెట్టుబడులతో ఆకర్షించి ముంచిన్నట్టు తేలింది. బాధితులో వైద్యులు, ఇంజనీర్లతో పాటు హోటల్లో పనిచేసే కార్మికులు కూడా ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దంపతుల మాటలు నమ్మిన బాధితులు తమ బంధువుల చేత పెట్టుబడులు పెట్టించారు.
మరో కిలాడీ దంపతుల చేతివాటం
ఇది ఇలా ఉండగా, బంజారాహిల్స్ రోడ్డు నెం. 12కు చెందిన ఫార్మసి పారిశ్రామికవేత్త గుజరాత్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నారు. ఇందుకోసం అక్కడ స్థల అన్వేషణలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్కు చెందిన కిలాడీ దంపతులు ఎలాగైన దాన్ని క్యాష్ చేసుకోవాలని భావించారు. గుజరాత్లో ఉన్న తమ స్థలాన్ని అమ్ముతున్నట్టు ఇంటర్నేట్లో ప్రకటన ఇచ్చారు. ఇది చూసిన పారిశ్రామికవేత్త వారిని సంప్రదించారు.
రెండెకరాలు ఉందని చెప్పిన దంపతులు గుజరాత్ రాష్ట్రానికి తీసుకువెళ్లి ఓ స్థలాన్ని చూపించారు. ఇది నమ్మిన పారిశ్రామికవేత్త వారికి రూ. 2 కోట్లు చెల్లించాడు. అప్పటి నుంచి దంపతులు ముఖం చాటేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న దంపతులు చివరకు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొంది పోలీసుస్టేషన్లో సరెండర్ అయ్యారు. వీరి మోసాలు జాబితాలో మరికొంత మంది ఉన్నట్లు తేలింది.