అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే నడిచొచ్చాడు
వరంగల్: ఇంట్లో వాళ్లు తిట్టారని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఓ యువకుడు చనిపోయాడని భావించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో ఆ వ్యక్తి బతికున్నానంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి - వరంగల్ ఎల్లమ్మబజార్కుచెందిన కోల అనిల్కుమార్(33) అల్లరిచిల్లరగా తిరగడంతో తండ్రి లక్ష్మీనారాయణ మందలించాడు. దీంతో తల్లిదండ్రులతో గొడవపడిన అనిల్ ఈనెల 4వ తేదీన అదృశ్యమయ్యాడు. అతడి గురించి ఎంత వెతికినా ఫలితం దక్కలేదు.
గుర్తుతెలియని యువకుడు రైలు కింద పడి మృతిచెందాడని తెలియడంతో తండ్రి లక్ష్మీనారాయణ ఎజిఎం మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించాడు. అయితే, మృతదేహం శిథిలంకావడంతో ఆనవాళ్లు తెలియలేదు. అయితే, మృతదేహానికి ఉన్న ఎరుపు రంగు టీషర్ట్ను చూసి అది అనిల్దేనని నిర్దారించుకున్నాడు.
దాంతో వరంగల్ జిఆర్పిఎఫ్ పోలీసుల సహకారంతో, ఎంజిఎం అధికారుల అనుమతితో ఆ మృతదేహాన్ని బరువెక్కిన గుండెలతో ఇంటికి తరలించారు. చెట్టంత కొడుకు చేతికివస్తాడని భావిస్తే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బోరున విలపించాడు. కొడుకు అంత్యక్రియలకు అన్నిఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో కుమారుడు అనిల్ ఇంటికి చేరుకోవడంతో అందరూ అవాక్కయ్యారు.
తన కొడుకు బతికి ఉన్నాడని తెలిసిన తల్లిదండ్రుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఇదిలా ఉంటే.. అదే వయస్సు కలిగిన మరో యువకుడి మృతదేహాన్ని పొరపాటున ఇంటికి తరలించామని, అనిల్ తల్లిదండ్రులు, బంధువులు నిర్దారణకు వచ్చారు. విషయం తెలిసిన అధికారులు తిరిగి మృతదేహాన్ని ఎంజిఎంకు తరలించగా, అనిల్ బతికి ఉన్నాడని తెలియడంతో బంధువులు, స్నేహితులు చూసేందుకు వచ్చారు.