కేక్, కూల్ డ్రింక్ తెచ్చాడు, కలిసుందామన్నాడు: ఆమెను చంపేశాడు
చిత్తూరు: ఓ మహిళను సవతి కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శివాడి గ్రామంలో శనివారం రాత్రి లక్ష్మి (28) అనే వివాహితను హత్య చేశారు.
సంఘటనపై హతురాలి అన్న సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివాడికి చెందిన లక్ష్మికి అదే గ్రామానికి చెందిన రవితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి విష్ణు (9) అనే కుమారుడు ఉన్నాడు.
మనస్ఫర్థలు రావడంతో..
దాదాపు ఏడేళ్ల వారి కాపురం సజావుగానే సాగింది. అయితే ఆ తర్వాత విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో లక్ష్మి భర్తను వదిలేసి గ్రామంలోనే కుమారుడు విష్ణుతో కలసి ఉంటోంది. లక్ష్మికి పలమనేరు మండలం జంగాలపల్లెకు చెందిన వివాహితుడు మస్తాన్ బాబుతో పరిచయం ఉండేది. ఆ తర్వాత మస్తాన్ బాబును ఆమె పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
లక్ష్మతో వారి గొడవ
మస్తాన్బాబు భార్య, కుమారుడు భరత్ (20) తరచూ శివాడికి వెళ్లి లక్ష్మితో గొడవ పడుతూ వచ్చాడు. కాగా, భరత్ తన స్నేహితుడితో కలసి కేక్, కూల్డ్రింక్ తీసుకొని శనివారం రాత్రి శివాడిలోని లక్ష్మి ఇంటికి వచ్చాడు. మనమంతా కలిసి ఉందామని గొడవలు వద్దని చెప్పాడు. లక్ష్మి అతని మాటలను విశ్వసించింది.
ఉదయమే వెళ్తానని చెప్పి...
ఇక్కడే భోజనం చేసి ఉదయాన్నే ఇంటికి వెళ్తానని భరత్, అతని స్నేహితుడు అక్కడే లక్ష్మి ఇంట్లోనే ఉన్నారు. ఉదయం విష్ణు నిద్ర లేచే సరికి తల్లి లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉంది. అతను గట్టిగా కేకలు వేశాడు. దాంతో ఇరుగుపొరుగు వారు వచ్చి లక్ష్మి హత్యకు గురైనట్లు గుర్తించారు. అప్పటికే భరత్, అతని స్నేహితుడు పారిపోయారు.
అన్న ఫిర్యాదు చేశాడు
హత్య గురించి లక్ష్మి అన్న సుబ్రహ్మణ్యంకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంగవరం సీఐ మధుసూదన్ రావు, పెద్దపంజాణి ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మికి మస్తాన్బాబుతో ఉన్న సానిహిత్యమే ఈ హత్యకు దారి తీసిందని సుబ్రహ్మ ణ్యం చెప్పారు. మస్తాన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.