లంచం ఇవ్వలేక.. రైలు కిందపడి తండ్రీకూతుళ్ల ఆత్మహత్య
మహబూబ్నగర్: ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి లంచం ఇచ్చి భార్యకు వైద్యం చేయించుకోలేక.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రీ తన కూతురుతోపాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని వీరన్నపేటలో చోటు చేసుకుంది.
‘మా దగ్గర ఒక్క రూపాయీ తీసుకోమని చెప్పారు. అవును కాబోలని నమ్మినందుకు నన్ను అంతా బకరాను చేశారు. స్ర్టెచర్పైకి ఎక్కించాలన్నా డబ్బులు! కాన్పు తరువాత.. బట్టలు మార్చాలన్నా డబ్బులు! ఎల్ఆర్లోనూ, ఓపీలోకి మారేటప్పుడూ అంతే! అయినా.. ఆపరేషన్ టైంలో బయట నుంచి మందులు తీసుకురావాలని ఎందుకు చెబుతారని అడుగుతున్నాను' అని మృతుడు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
పోలీసుల కథనం, ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన కేశవులు(35) తన భార్య నాగలక్ష్మిని రెండో కాన్పు కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆమెకు చికిత్స చేయించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో వారికి డబ్బులు ఇచ్చాడు.

కాగా, గురువారం వారు మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది తీరుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్కు ఫిర్యాదు చేశాడు. సిబ్బంది డబ్బులకు వేధిస్తున్నారని, ఇవ్వకుంటే సరైన వైద్యం అందించడం లేదని మానసిక క్షోభకు గురయ్యాడు.
సిబ్బందిపై చర్యలు తీసుకుంటారనే నమ్మం తనకు లేదంటూ ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లిన కొద్దిగంటల్లోనే స్థానిక వీరన్నపేట గేటు వద్ద కేశవులు తన రెండేళ్ల కుమార్తె తేజశ్రీతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాని చెన్నకేశవులు లేఖ అతని జేబులోనే ఉంది.
కాగా, భర్త, కూతురు మృతి విషయం తెలుసుకున్న అతని భార్య నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో డబ్బు ఎవరు అడిగారో రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని కేశవులుకు చెప్పామని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామూల్ తెలిపారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications