రేప్ యత్నం: ఆస్పత్రిపై నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకున్న నిందితుడు
కరీంనగర్/ హైదరాబాద్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై ఓ నీచుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నింసాడు. దాంతో వృద్ధురాలు పెద్దగా కేకలు వేసింది.
ఆమె కేకలు విన్న వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాన్ని గమనించిన సత్తయ్య ఆస్పత్రి రెండో అంతస్థు నుంచి కిందికి దూకాడు. దాంతో అతని కాళ్లు విరిగాయి. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులో ఓ బాలికను కిడ్నాప్ చేసి, చెవిపోగులూ కాళ్లపట్టాలూ తీసుకుని వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది. కాప్రాలోని జమ్మిగడ్డ భరత్ నగర్లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కూతురు ధృతి (5) స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్లో ఎల్కెజీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి ముందు ఆడుకుంటున్న ధృతి వద్దకు ఓ మహిళ వచ్చి తనతో వస్తే చాక్లెట్ కొనిస్తానని ఆశ పెట్టింది.
ధృతి దాంతో ఆమె వెంట వెళ్లింది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని గల రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు తీసుకుని వెళ్లింది. అక్కడ ఓ గల్లీలో బాలిక చెవులకు ఉన్న 2 గ్రాముల బంగారం పోగులు, 5 తులాల కాళ్ల పట్టీలు తీసుకుని పారిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఏడు గంటల తర్వాత కుషాయిగుడా పోలీసులకు సాకేత్ వద్ద ధృతి ఏడుస్తూ కనిపించింది. వారు ఆమెను జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికను అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.