ఆస్తి కోసం తమ్ముడి తల నరికిన అన్న ఘాతుకం
సమాజంలో మానవ సంబంధాలు,ఆప్యాయతలు, అనుబంధాలు రోజురోజుకీ మృగ్యమైపోతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు ఒకరినొకరు జరుపుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఆస్తి కోసం సొంత సోదరుడినే తల నరికి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. దిగ్బ్రాంతి కరమైన ఈ సంఘటన అనంతపురం జిల్లా శనగల గూడూరు లో జరిగింది. అనంతపురం జిల్లా శనగల గూడూరులో జరిగిన ఈ దారుణంలో ఆస్తి కోసం అన్న రామాంజనేయులు తమ్ముడి నిర్దాక్షిణ్యంగా తల నరికి పొలంలో పడేశాడు. అత్యంత కిరాతకంగా వేట కొడవళ్ళతో తల నరకడంతో,తల మొండెం రెండూ వేరైపోయాయి. తమ్ముడిని హతమార్చిన రామాంజనేయులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అఖిలప్రియ పైన సొంత తమ్ముడు కేసు: ఆస్తి వివాదంలో కోర్టుకు: పంపకాల వివాదంలో..!
పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన రామాంజనేయులుకి తన తమ్ముడు రాజ కుల్లాయప్ప(40)తో ఆస్తి తగాదాలు గత కొంత కాలంగా కొనసాగుతున్నాయి. వివాదాలు పెరగడంతో తమ్ముడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు అన్న రామాంజనేయులు. అసలు విషయానికి వస్తే రామాంజనేయులుకి మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరి ముగ్గురికి తల్లిదండ్రులు సమానంగా అందరికీ ఐదు ఎకరాల పొలం పంచి ఇచ్చారు. తరువాత రామాంజనేయులు తమ్ముడు తన ఐదు ఎకరాలను అన్నకు కౌలుకు ఇచ్చాడు. కౌలు విషయంలో తలెత్తిన వివాదం అన్నాదమ్ముల మధ్య చిలికి చిలికి గాలివాన అయ్యింది.
తమ్ముడు రాజ కుల్లాయప్ప తన పొలాన్ని వేరే వారికి కౌలుకు ఇచ్చాడు. దీంతో అన్న రామాంజనేయులు తనకు కాకుండా వేరే వ్యక్తులకు పొలం ఎలా ఇస్తావంటూ ఘర్షణకు దిగారు. నా పొలం నా ఇష్టమొచ్చినవారికి ఇచ్చుకంటాను అన్న తమ్ముడిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయిన రామాంజనేయులు వేట కొడవలితో తమ్ముడిని తల నరికి చంపాడు . మొండెం నుంచి తల వేరుగా తెగి పడిపోయింది. అనంతరం భయపడిన రామాంజనేయులు పరారయ్యాడు. కిరాతకంగా హత్య చేసిన రామాంజనేయులు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.