వివాహేతర సంబంధాలపై లేఖలు: అసభ్యకర రీతిలో!, నాలుగు కుటుంబాల్లో కలకలం..
రాత్రి పూట గ్రామంలో నిఘా పెట్టగా అదే గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరామమూర్తి అనే ఓ వృద్ధుడు ద్విచక్రవాహనంపై వెళుతూ పలు లేఖలను విసిరేస్తున్నట్లు గుర్తించారు.
ఏలూరు: 'వివాహేతర సంబంధాల' పేరుతో చిచ్చు పెట్టాలని చూసిన ఓ వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని ఎస్సీ పేటలో ఈ ఘటన జరిగింది. ఇటీవలి కాలంలో పలువురి ఇళ్ల ఎదుట లేఖలు పడి ఉంటుండటం.. ఆ లేఖల్లో వివాహేతర సంబంధాల గురించి పుంఖాను పుంఖాలుగా రాయడంతో గ్రామంలో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ పేటకు చెందిన పమ్మి శ్రీనుతో పాటు ఆ గ్రామంలోని నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వివాహేతర సంబంధాలున్నాయన్న ప్రచారం గ్రామంలో మొదలైంది. ఈ ప్రచారమంతా కొన్ని లేఖల ఆధారంగా సాగిందే. గుర్తు తెలియని వ్యక్తి రాత్రిపూట ఆయా వ్యక్తుల ఇళ్ల ముందు ఈ లేఖలను వదిలిపోతున్నాడు. అందులో వివాహేతర సంబంధాల గురించి అసభ్యకర రీతిలో రాస్తూ వస్తున్నాడు.
ఈ లేఖలతో గ్రామంలోని ఆ నాలుగు కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. దీని వెనుకాలో ఎవరున్నారో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. రాత్రి పూట గ్రామంలో నిఘా పెట్టగా అదే గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరామమూర్తి అనే ఓ వృద్ధుడు ద్విచక్రవాహనంపై వెళుతూ పలు లేఖలను విసిరేస్తున్నట్లు గుర్తించారు.
ఆ వెంటనే అతన్ని గ్రామంలోని రామాలయం వద్ద నిర్భంధించారు. ఆపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు వారించడంతో కొంత వాగ్వాదం జరిగింది. ఇదే క్రమంలో వృద్ధుడిని తమకే అప్పగించాలంటూ గ్రామస్తుల్లో కొంతమంది ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో.. పోలీసులు వారికి నచ్చజెప్పారు.
కాగా, లేఖలు తానే రాయించినట్లు వృద్ధుడు అంగీకరించాడు. తమ గ్రామానికే చెందిన ఒక యువతి, మరో వ్యక్తితో కలిసి లేఖలు రాయించినట్లు ఒప్పుకున్నాడు. వివరాలు రాబట్టిన పోలీసులు మిగతా నిందితులను కూడా అరెస్టు చేసేందుకు సన్నద్దమవుతున్నారు.