సంక్షేమం నినాదం బూమ్ రాంగ్ - గట్టెక్కేదెలా, అసలుకే మోసం..!!
ఈ సారి ఏపీ ఎన్నికల్లో సంక్షేమ నినాదం కీలకం కాబోతోంది. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమమే తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని నమ్ముతున్నారు. జగన్ ను దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గతం కంటే భిన్నంగా ముందుగానే ఎన్నికల తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసారు. అదంతా కాపీ మేనిఫెస్టోగా ఆరోపణలు వచ్చాయి. జగన్ ను దెబ్బ తీయాలంటే ధీటైన సంక్షేమ మేనిఫెస్టో అవసరమని గుర్తించినా..ఫలితం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.
సంక్షేమ ఓట్ బ్యాంక్ పై గురి:ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని నమ్ముతున్నారు. దీంతో సంక్షేమ పథకాల బ్దిదారుల ఓట్ బ్యాంక్ ను మరింత పటిష్ఠం చేసుకొనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో పధకాలు అమలు చేసిన అనేక కారణాలతో నిలిచిన వారికి తిరిగి పథకాలను పునరుద్దరిస్తున్నారు. రాష్ట్రంలో 89 శాతం కుటుంబాలకు సంక్షేమం అందుతోందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా తాను ప్రతీ ఇంటికి మంచి చేసానని నమ్మితే తనకు అండగా నిలవాలని సీఎం జగన్ ప్రతీ సభలో కోరుతున్నారు. దీంతో, ఇప్పుడు జగన్ ఓట్ బ్యాంక్ పైన టీడీపీ ఫోకస్ చేసింది.

టీడీపీ మేనిపెస్టో ప్రచారంతో:గతం కంటే భిన్నంగా ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో తొలి విడతను పార్టీ మహానాడులోనే ప్రకటించారు. జగన్ అమలు చేసే సంక్షేమానికి ధీటుగా అదిరిపోయే పథకాలు తీసుకొస్తున్నామ ని ప్రకటించారు. అందులో 18-59 వయసు గల మహిళలకు రూ 1500 ప్రతీ నెలా ఇస్తామని వెల్లడించారు. ప్రతీ తల్లికి రూ 15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు అంటే అంత మందికి ఇస్తామని తల్లికి వందనం పేరుతో మరో హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించారు. యువత, రైతులు,బీసీలకు సంబంధించి పథకాలు ప్రకటించారు. వీటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి పార్టీ నేతలను ప్రచారం కోసం ప్రజల్లోకి పంపారు.
ఎత్తుగడ ఫలించలేదా:కానీ, టీడీపీ పథకాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సీనియర్లు మేనిఫెస్టో ప్రకటన సమయంలోనే ఈ పథకాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ. జగన్ అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తూ ఇప్పుడు అదే బాటలో వెళ్లటం ద్వారా ప్రయోజనం ఉండదని సూచించినట్లు చెబుతున్నారు. కానీ, జగన ను దెబ్బ కొట్టాలంటే అంత కంటే మెరుగైన పథకాలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందనే పార్టీ వ్యూహకర్తల సూచనలతో టీడీపీ ముందుకు వెళ్లింది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రాజెక్టుల పరిశీలన..ప్రభుత్వంపై ఆరోపణలు కింది స్థాయి ఓటర్లను ఆకట్టుకొనే అవకాశం లేదని గుర్తించారు. టీడీపీ అధినేత ఏం చెప్పినా అమలు చేయరంటూ జగన్ చేసిన ప్రచారం మొత్తానికే చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీసేలా చేసింది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల్లో జగన్ పైన పై చేయి సాధించటానికి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications