పవన్! రాజకీయ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు ఫైర్
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు.
సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంలో జనసేన పార్టీ ఉందన్నారు.
ఇప్పటికే 90 శాతం భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారన్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇతర పార్టీలు రాజకీయ స్వార్ధం వీడి రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు.
అభ్యంతరాలున్న గ్రామకంఠాలపై రీసర్వే: పుల్లారావు, నారాయణ
గ్రామకంఠాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం వారు గ్రామకంఠాలను పరిశీలించారు.
గ్రామకంఠాల నిర్ధారణ కొంత ఆందోళన కలిగించిందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరిస్తామని వారు చెప్పారు. దీనిపై వారం రోజుల్లో రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులతో కలిసి అభ్యంతరాలున్న గ్రామకంఠాలపై రీసర్వే చేయిస్తామన్నారు.
గతంలో చెప్పిన మేరకే డిసెంబరు 8, 2014 నాటికి వున్నటువంటి గ్రామకంఠాల ఇళ్ల జోలికి వెళ్లే పనిలేదని, ఎలాంటి భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. పవన్కల్యాణ్ భూసమీకరణలో భూములిస్తే తీసుకోమన్నారని, పవన్ చెప్పింది తాము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని స్పష్టం చేశారు.