జగన్తో విభేదాలు: వివరణ ఇచ్చిన చిన్నాన్న మనోహర్ రెడ్డి
కడప: తాను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ మనోహర్రెడ్డి వివరణ ఇచ్చారు. వైఎస్ కుటుంబంలో తామంతా కలిసికట్టుగా ఒకటిగానే ఉంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆయన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 1995 నుంచి తమ చిన్నాన్న రాజారెడ్డి పంచాయతీ వ్యవహారాలు కూడా తనకే అప్పగించారని ఆయన చెప్పారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు పులివెందుల వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నానని స్పష్టం చేశారు. పులివెందుల పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో 25 ఏళ్లుగా తనకే అధికారం కట్టబెట్టారన్నారని చెప్పారు. కానీ కొన్ని పత్రికల్లో పార్టీని వీడుతున్నట్లు రావడం బాధాకరమని అన్నారు. వైసీపీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
తాను జగన్ నుంచి విడిపోవడమనేది కల మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం తన సతీమణి వైఎస్ ప్రమీల మున్సిపల్ ఛైర్పర్సనగా బాధ్యతలు కొనసాగిస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సిన ఆలోచన ఎందుకొస్తుందని ప్రశ్నించారు.
ఇదిలాఉండగా వారం రోజుల క్రితం వైఎస్ మనోహర్రెడ్డి వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు పులివెందుల్లో ప్రచారం సాగింది. ఆయనతో వైఎస్ కుటుంబ సభ్యులు చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. మీడియా వార్తలు వెలువడిన మూడు రోజుల తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications