మాన్సాస్ ట్రస్ట్ దుమారం: ఆ జీవోను విడుదల చేయకుంటే కోర్టుకు వెళ్తా: అశోక్ గజపతి రాజు
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మండిపడుతున్నారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని పేర్కొన్న ఆయన ట్రస్టు, దేవాలయ భూములపై కన్నేశారని ఆరోపణలు గుప్పించారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అసహనం
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో జీవో ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించిన అశోక్ గజపతి రాజు జీవోను విడుదల చేయాలి లేకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రాజధాని తరలింపు వ్యవహారంతో తాము కూడా బాధితులుగా మారామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరును టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు వింతగా ఉందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ జీవో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్న
చైర్మన్గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని పేర్కొన్న ఆయన ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని చెప్పిన ఆయన ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. మాన్సాస్ చైర్మన్ పదవి మార్పు వింతగా ఉందని పేర్కొన్నారు.

వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదు
ఇప్పటికే రాష్ట్రం అన్ని రకాలుగా భ్రష్టు పట్టిందని ,వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం వల్ల భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని ఆయన పేర్కొన్నారు. . రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని పేర్కొన్నారు అశోక్ గజపతి రాజు.

జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తా అన్న టీడీపీ నేత
మాన్సాస్ ట్రస్ట్లో దేవాదాయ శాఖ అధికారులతోనే ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ జోక్యం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా ఇప్పటివరకు ఎన్నడూ ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారని అశోక్ గజపతి రాజు ఆరోపించారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తానని చెప్పారు. ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై జీవో వచ్చాక నిర్ణయం తీసుకుంటామని అశోక్ గజపతి రాజు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications