70 కోట్లా, 678 కోట్లా.. ఏపీకి కేంద్రం ఇచ్చిందెంత?
హైదరాబాద్: ప్రభుత్వాల పనితీరును ప్రజలకు వ్యక్తపరిచే పత్రికలు.. పార్టీల తరుపున వకల్తా పుచ్చుకుని రాయడం మొదలెట్టాక.. నిజా-నిజాలేంటో సామాన్యులకు అర్థంకాని పరిస్థితి. ఏం చేసినా ఆయా పార్టీలను వెనుకేసుకు రావడమే వాటి ముఖ్య ఉద్దేశ్యం.
తాజా రాజకీయాల్లో చంద్రబాబు సర్కార్ ను వెనుకేసుకొచ్చే ఓ పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. హుద్ హుద్ తుఫాన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శించిందనేది దాని సారాంశం. ఆ పత్రిక కథనం ప్రకారం.. హుద్ హుద్ తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని గట్గెక్కించడానికి కేంద్రం చేసిన సహాయం కేవలం 70 కోట్లేనట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇదే పత్రిక హుద్ హుద్ సంభవించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి 400 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించినట్టుగా వార్తలు రాయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం 678 కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్టుగా పలు సందర్భాల్లో ప్రకటించింది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన 1000 కోట్లకు బదులు 678 కోట్లే ఇవ్వడం పట్ల పలువురు మంత్రులు కూడా అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడు ఈ కథనాన్ని వెలువరించింది చంద్రబాబు అనుకూల మీడియా కాబట్టి.. చంద్రబాబు సర్కార్ పరోక్షంగా బీజేపీనే టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కనబెడితే హుద్ హుద్ సమయంలో అసలు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం 678 కోట్లా.. 70 కోట్లా.. అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీనిపై స్పందిస్తారా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ పై చంద్రబాబుకు ఉన్న పట్టు అలాంటిది మరి. మరి దీనిపై చంద్రబాబు ప్రభుత్వమైనా ప్రజలకు క్లారిటీ ఇస్తుందో లేదో..