కేసీఆర్ షాకిస్తున్నారు: జగన్కు రివర్స్, మేకపాటి మళ్లీ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు షాకిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలు ఝలకిస్తున్నారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, టీడీపీల నుండి పెద్ద ఎత్తున తెరాసలో చేరుతున్నారు.
తెరాసకు హైదరాబాదులో బలం లేదనే వాదన ఉంది. అయితే, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి వారి చేరికతో బలం పుంజుకుందనే చెప్పవచ్చు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీ - బీజేపీ కూటమి 14 స్థానాలలో గెలిచింది.
ఇందులో సాధ్యమైనంత మందిని తమ వైపుకు రప్పించుకునేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మజ్లిస్ పార్టీతో వెళ్లనున్న తెరాస ఎలాగైనా హైదరాబాద్ పీఠం ఎక్కాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పాటు కాంగ్రెస్ వారికి కూడా గాలమేస్తోంది.
తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కేసీఆర్ను కలిశారు. ఆయన కారు ఎక్కనున్నారని తెలుస్తోంది. హైదరాబాదుతో పాటు తెలంగాణలోను మరింత బలోపేతం అయ్యేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆయన జిల్లాల్లోని ముఖ్య నేతల పైన దృష్టి సారించింది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే కవితలు త్వరలో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు.
తెరాస అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో పదిమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. దీంతో తెరాస బలం 73కు చేరుకుంది. ఎన్నికల్లో తెరాస 63 స్థానాల్లో గెలిచింది. అప్పటి నుండి టీడీపీ, కాంగ్రెస్స నుండి పలువురు చేరారు.
రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఆపరేషన్ ఆకర్ష్ పూర్తి చేయాలని చూస్తోంది. తమ వైపుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను రప్పించుకోవడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూసుకోవాలని తెరాస భావిస్తోందని అంటున్నారు.
మరోవైపు, ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జగన్ అధికారంలోకి వస్తాడని భావించి చాలామంది ఆయన వెంట నడిచారు. కాంగ్రెస్, టీడీపీల నుండి పెద్ద ఎత్తున జగన్ పార్టీలో చేరారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నికల వరకు ఆ చేరికలు కొనసాగాయి.
అయితే, ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఒక్కరొక్కరు ఫ్యాన్కు గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికలకు ముందే పలువురు వెళ్లిపోయారు. ఆ తర్వాత మారెప్ప నుండి కొణతాల వరకు వరుసగా ఆయనకు దూరమవుతున్నారు. సీనియర్లు దూరం కావడానికి జగన్ వైఖరే కారణమనే వాదనలు ఉన్నాయి.
జగన్కు దగ్గర అనుకున్న వాళ్లు కూడా వెళ్లిపోతుండటం గమనార్హం. మొదటి నుండి జగన్కు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని, ఏపీ సీఎం చంద్రబాబులను పొగడ్తలలో ముంచెత్తడం గమనార్హం. గురువారం కూడా మేకపాటి మోడీని పొగిడారు. ఎస్పీఎస్ నెల్లూరులో జన్మభూమిలో పాల్గొన్న అతను.. మోడీ ప్రపంచ మన్ననలు పొందుతున్నారన్నారు.