నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అతనే, మంత్రులకు కూడా తెలియదు: వెంకయ్య
విజయవాడ: తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి ఉంటే భారత్ ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు. మహాత్మా గాంధీ సూచన మేరకు పటేల్ ప్రధాని పదవిని వదులుకున్నారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పటేల్ ఎంతో కృషి చేశారన్నారు.

దురదృష్టవశాత్తూ ఆయనను భారతరత్నగా గుర్తించడానికి చాలా ఏళ్లు పట్టిందన్నారు. అన్నీ గుణగణాల కలబోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అన్నారు. సర్దార్ పటేల్ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు.
నవతరానికి, యువతరానికి ఆయన ఎవరో తెలియదని, ఆయన జీవితం గురించి తెలియదన్నారు. మీలోనే కాదు, వివిధ రాష్ట్రాలలోను ఉండే చాలామంది మంత్రులకు కూడా పటేల్ గురించి తెలియదన్నారు. పటేల్ 564 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన నేత అన్నారు. పట్టుదలకు ఆయన ప్రతీక అన్నారు.
జీవితంలో ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరమని, శిక్షణతోనే నైపుణ్యాలు మెరుగుపడతాయని విద్యార్థులకు హితబోధ చేశారు. సమాజంలో సామరస్యం ఉండాలంటే కొన్ని పద్ధతులు, వ్యవస్థ ఉండాలన్నారు. వాటిని మనం గౌరవించుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications