నేను తప్పు చేశా, జైలుకు పంపించాడు అందుకే: నీతూ అగర్వాల్
హైదరాబాద్: తల్లిదండ్రులను వద్దనుకొని తాను తప్పు చేశానని, మస్తాన్ వలీని నమ్మి తాను తల్లిదండ్రులను వదులుకున్నానని ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలు నుండి విడుదలైన నీతూ అగర్వాల్ అన్నారు. తాను ఇప్పుడు అనుక్షణం ప్రాణభయంతో కాలం వెల్లదీస్తున్నానని చెప్పింది.
ఆమె ఓ టీవీ చానల్తో మాట్లాడారు. తనను కొందరు చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మి పెళ్లి చేసుకుంటే మస్తాన్ వలీ తనకు నరకం చూపించాడని వాపోయింది. శారీరకంగా హింసించినా తాను ఏనాడు బాధపడలేదని, జైలుకు పంపించడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.
ఇంట్లోంచి బయటకు పెడితే మస్తాన్ వలీ అనుమానంతం ప్రశ్నించేవాడని, తన కుటుంబాన్ని వదిలేయడం వల్లే వాళ్లు తన గురించి పట్టించుకోవడం మానేశారని చెప్పింది. తన తండ్రికి పట్టుదల ఎక్కువ అని చెప్పింది.
వలీకి అంతకుముందే రెండుసార్లు పెళ్లి అయిన విషయం తనకు తర్వాతే తెలిసిందని చెప్పింది. వలీ తన వ్యక్తిగత విషయాలు తనకు ఎప్పుడూ చెప్పలేదంది. పెళ్లయ్యాక అతను తనను వేధించాడని, తన డెబిట్ కార్డులు ఉపయోగించుకున్నాడని చెప్పింది. అతను చేసే బిజినెస్ గురించి తనకు తెలియదని చెప్పింది.
తన పైన దాడి చేసిన నాగరాజు అంశం గురించి మాట్లాడుతూ... తనకు అంతకుముందు నాగరాజు తెలియదని చెప్పింది. తాను జైలులో ఉన్నప్పుడు నాగరాజు మినరల్ వాటర్, ఇడ్లి ఇచ్చేవాడని చెప్పింది.
అప్పుడే తనకు తెలిసునని, తాను జైలు నుండి బయటకు వచ్చాక అతని ఇరవై వేల రూపాయలు ఇచ్చానని చెప్పింది. నాగరాజు గురించి తనకు అంతకుమించి ఏమీ తెలియదని చెప్పింది. అతను తనకు స్నేహితుడు లేదా బంధువు ఏదీ కాదని చెప్పింది.