మా పెళ్లి కోసమే సినిమా నిర్మించినట్టున్నారు: నీతూ అగర్వాల్
హైదరాబాద్: తమ ఇద్దరి వివాహం కోసమే తన భర్త, ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ సినిమా నిర్మించినట్టున్నారని సినీ నటి నీతూ అగర్వాల్ అభిప్రాపడింది. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన కేసులో బెయిల్పై విడుదలైన నీతూ అగర్వాల్ మీడియాతో పలు విశేషాలను పంచుకుంది.
తనకు చిన్నప్పట్నుంచి సినిమాల్లో నటించాలని, పెద్ద హీరోయిన్ కావాలనే కోరిక ఉండేదని చెప్పింది. అందుకే తాను మస్తాన్ వలీని కలిశానని తెలిపింది. షూటింగ్ జరుగుతుండగానే ప్రేమలో పడ్డామని, ప్రేమించిన కారణాంగానే ఆయన గురించి ఏమీ తెలుసుకోలేదని నీతూ వెల్లడించింది.
తనకు నెమ్మదిగా నిజాలు తెలియడంతో నిలదీశానని, ఎదురుతిరుగుతానని భావించి తన ఏటిఎం కార్డు తీసుకుని తనను కేసులో ఇరికించాడని నీతూ అగర్వాల్ చెప్పింది. మస్తాన్ వలీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆ పెట్టుబడిని సినిమాల్లో పెట్టిన విషయం తెలిసిందే.
కాగా, అంతకుముందు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుతురాలైన నీతూ అగర్వాల్ గురువారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానంలో హాజరయ్యారు. ప్రయివేటు వ్యక్తులు వెంట రాగా ఆమె తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన కారులో న్యాయస్థానానికి వచ్చారు. వచ్చే నెల 17వ తేదీన తదుపరి వాయిదాకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.