ఆ కాలనీని అందుకే ఖాళీ చేయిస్తున్నారా?: ఏపీ ప్రభుత్వానికి ఎంపీ చిరంజీవి లేఖాస్త్రం!
తిరుపతి లోని పేదల తరపున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ కె.చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 18వ వార్డు స్కావెంజర్స్ కాలనీ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరు
అమరావతిః తిరుపతి లోని పేదల తరపున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ కె.చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. 18వ వార్డు స్కావెంజర్స్ కాలనీలో 70 ఏళ్లుగా కాపురం ఉంటున్న 160 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించి 2.34 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వానికి వెల్లడించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాలనీలో పలు అభివృద్ధి పనులు చేయించానన్నారు. మానవీయ కోణంలో చూసి బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.
ఎన్నో దశాబ్దాలుగా, తరతరాలుగా నివాసం ఉంటున్న పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలను, యానాది కులస్తులను అక్కడి నుంచి తరిమి వేయడానికి ప్రభుత్వం వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తామంటూ మభ్య పెడుతోందన్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండటం ఈ ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు.
ప్రజలందరిని సమానంగా చూడాలని మన రాజ్యాంగం చెబుతున్నా అందుకు విరుద్దంగా.. ప్రభుత్వం తన బల ప్రయోగంతో.. బలహీనులైన పారిశుద్ద్య కార్మిక కుటుంబాలను, యానాది కుటుంబాలను తరలించాలని చూడటం సహించరాని చర్య అని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.
స్కావెంజర్స్ కాలనీని రోల్ మోడల్ కాలనీగా అభివృద్ధి పర్చాలని, వారి కుటుంబాల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి తగిన భరోసా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నట్లుండి మెగాస్టార్ రాసిన లేఖ ఇటు రాజకీయ పార్టీలకు.. అటు ఆయన అభిమానులకూ అంతులేని ఆశ్చర్యం కలిగించింది.
ఎందుకంటే, ఆయన చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో లేరు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ చిరంజీవి పాల్గొనడం లేదు. రాజకీయాల్లోంచి బయటికొచ్చేసి ఆయన సినిమాల్లో నటిస్తుండడం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత ఇక ఆయన సినీరంగంలో మళ్లీ బిజీ అయిపోతారని అందరూ ఊహించారు.
మరో రెండు సినిమాల్లో నటించేందుకు ఆయా దర్శకులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి తిరుపతిలోని 18వ వార్డు స్కావెంజర్స్ కాలనీ వాసుల తరపున ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం చూస్తుంటే.. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోలేదని స్పష్టమవుతోంది.