గత ఎన్నికల్లో జగన్ సీఎం ఎందుకు కాలేదంటే..: వైసిపి ఎమ్మెల్యే ఆసక్తికరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు ఆయనను భరించే పరిస్థితుల్లో లేరని వైసిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు ఆయనను భరించే పరిస్థితుల్లో లేరని వైసిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరులో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కరువు తాండవిస్తోందన్నారు.
రానున్న రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నగర అధ్యక్షుడిగా ఎన్నికవడం తథ్యమన్నారు. నెల్లూరులో వచ్చే ఎన్నికల్లో వైసిపి అంతటా గెలుస్తుందన్నారు.
వెన్నుపోటు నుంచి..
చంద్రబాబు తనకు గుర్తింపు ఇచ్చిన మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచాడని, అప్పటి నుంచి ఇప్పటి దాకా మాయమాటలతో మభ్య పెడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు రాజకీయ కారణాలతో కేంద్రంతో రాజీపడ్డారన్నారు.
జగన్ సీఎం కావాల్సి ఉండే కానీ..
గత ఎన్నికల్లోనే జగన్ ముఖ్యమంత్రి కావాల్సి ఉండెనని, కానీ మరింత కాలం ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాల్లో అనుభవం సాధించేందుకు దేవుడు ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చాడేమోనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఇదీ లోకేష్, జగన్కు తేడా
తమ నాయకుడు జగన్కు, నారా లోకేష్కు హీరోకు, కామెడీ యాక్టర్కు ఉన్నంత తేడా ఉందని అనిల్ యాదవ్ అన్నారు. జగన్ సీఎం కావాలన్నదే తన మొట్టమొదటి మొక్కు అన్నారు.
ఎన్నికలే లక్ష్యంగా..
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేస్తామని అనిల్ యాదవ్ అన్నారు. డివిజన్ వారీగా, బూతుల వారీగా కమిటీలు వేస్తామన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వారే అసలైన సైనికులు అన్నారు. తమ కార్యకర్తలకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు.