చంద్రబాబు టార్గెట్: వైసిపి పార్లమెంటు వ్యూహం ఖరారు
హైదరాబాద్: రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. హైదరాబాదులోని లోటస్పాండ్లో శనివారంనాడు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో పార్లమెంటులో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు.
సమావేశం తర్వాత వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నోటుకు ఓటు కేసును, రాజమండ్రి తొక్కిసలాట అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని వైసిపి అనుకుంటున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
ఓటుకు నోటు కేసు ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిదని, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని రాజమోహన్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కారణంగానే రాజమండ్రిలో 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. రాజమండ్రి దుర్ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
భూసేకరణ బిల్లు, ఆంద్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి స్పెషల్ రైల్వే జోన్, ధాన్యానికి కనీస ధర, పునర్విభజన చట్టం హామీలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. సవరణలు చేస్తే కేంద్రం ప్రతిపాదించే భూసేకరణ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు జులై 21వ తేదీన ప్రారంభమై మూడు వారాల పాటు జరుగుతాయి.