మోడీపై ప్రశంస, హితవు: జగన్కు మేకపాటి షాక్
నెల్లూరు: సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఇచ్చిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోక ముందే నెల్లూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై సంచలన ప్రకటన చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ తీరును తప్పు పడుతూ ప్రకటన చేశారు. తన తీరును సమర్థించుకున్నారు.
జగన్ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని మేకపాటి బుధవారంనాడు హితువు చెప్పారు. మంచి చేస్తున్నారు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీని తాను ప్రశంసించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, తాను బిజెపిలో చేరుతాననేది అసత్య ప్రచారమేనని ఆయన అన్నారు. నెల్లూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు ఉన్న మాట నిజమోనని ఆయన అంగీకరించారు. ప్రజాప్రతినిధిగా తాను జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మంగళవారంనాడు తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఆయనను బుజ్జగించడానికి పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ నాయకులకు ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఈ స్థితిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటన పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొదటి నుంచి పార్టీకి, జగన్కు అండగా నిలుస్తూ వస్తున్నారు. కాంగ్రెసు పార్టీకీ, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. జగన్కు కూడా వారి తీరు అంతుబడుతున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో విజయం సాధించగానే ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తపల్లి గీత వైయస్ జగన్పై విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి బిజెపికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.