బాబు మళ్లీ 'బ్లండర్' అంటారేమో, పెద్ద మేధావి: మేకపాటి, ఒళ్లు దగ్గర: కొల్లు
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమనే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీయే లీక్ చేసి ఉంటారని వైసిపి నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం నాడు అనుమానం వ్యక్తం చేశారు. వాజపేయి ప్రభుత్వం పదవీకాలం అయిపోయిన తర్వాత బీజేపీతో కలవడం తాను చేసిన పెద్ద బ్లండర్ అని నాడు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు కూడా అలాగే చేసే అవకాశం లేకపోలేదన్నారు.
రేపు యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు ఆ పార్టీతో పొత్తును ఎన్నాళ్లు కొనసాగిస్తారో చెప్పలేమన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి పదిహేనేళ్ల పాటు హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఇప్పుడు సంజీవిని కాదని మాట మార్చారన్నారు.
హోదా కోసం డిమాండ్ చేసేందుకు తాము ఈ రోజు (సోమవారం) వెల్లోకి వెళ్లామని, టిడిపి వాళ్లు మాత్రం తమ తమ స్థానాల్లో నిలబడి చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు ఆడారన్నారు. అరుణ్ జైట్లీ రాజ్యసభలో హోదా ఇవ్వమని చెప్పినందున ప్రజల మూడ్ను బట్టి చంద్రబాబు స్పందించాలనుకున్నారని, అందుకే ఆయన మాట్లాడారని ఎద్దేవా చేశారు.
నిద్రపోయారా: హోదాలోకి చిరంజీవిని లాగిన బీజేపీ మంత్రి
ప్రత్యేక హోదా ఇవ్వలేని, సాధించలేని టిడిపి, బీజేపీలను ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు. ఈ విషయం తెలిశాకే చంద్రబాబు స్వరం మార్చి, జైట్లీ చెప్పింది బాధాకరమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.
హోదా కోసం జగన్ ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. బంద్ తీవ్రతను బట్టే ప్రజల ఆకాంక్ష తెలుస్తుందన్నారు. హోదా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇవ్వకుంటే ప్రజలు సహించరన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము పార్లమెంటు బయట, లోపల ఆందోళన చేస్తామన్నారు. సభలో ప్రధాని ఇచ్చిన మాటకు విలువ లేకుంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఎలా కుదురుతుందన్నారు. చంద్రబాబు గొప్ప మేధావి అని, అందుకే ఎన్ని అబద్దాలు అయినా ఆడగలరన్నారు.
హోదా కోసం రెండేళ్లుగా పోరాటం: వైవీ
హోదా కోసం తాము రెండేళ్లుగా పోరాడుతున్నామని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గుంటూరులో జగన్ దీక్ష చేశారన్నారు. హోదాపై తీర్మానం కూడా ఇచ్చామని చెప్పారు. తాము స్పందించిన తర్వాతే టిడిపి స్పందించిందన్నారు. టిడిపి డ్రామాలు ఆడుతోందన్నారు.
బాబుపై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర: కొల్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడే ముందు వైసిపి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం నాడు హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ఆందోళన చేయాలన్నారు.
చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారన్నారు. జగన్ బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. ప్రధానితో సమావేశం తర్వాత దేనికైనా సిద్ధపడతామని స్పష్టం చేశారు.