మోడరన్ అంటూ మోసం: వైసిపి, వెంకయ్య ఏం చేస్తున్నారని జైరామ్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు సోమవారం మాట్లాడారు.
పదవులు కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదని వారు విమర్శించారు. మోడర్ కేటగిరీ అంటూ ప్రజలను తెలుగుదేశం పార్టీ నాయకులు అయోమయానికి గురి చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపైన బాధ్యత ఉందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ధర్నాకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు జైరాం రమేష్, కెవిపి రామచందర్ రావు, సుబ్బిరామిరెడ్డి కూడా హాజరయ్యారు. ఆనాడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. ఎపికి ప్రత్యేక హోదా అవసరమని, దాని కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఎపికి ప్రత్యేక హోదాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందని ఆయన అన్నారు.
ఎపికి ప్రత్యేక హోదా న్యాయమైందని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.